బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, అంతకంటే మెరుగ్గా ఆడి టీ20 సిరీస్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాదు వేదికగా జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా 133 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 297 పరుగులు చేసింది. విధ్వంసకర ఇన్నింగ్స్కు కేరాఫ్ భారత్ అన్నట్లుగా భారతజట్టు ఆడింది. ఓపెనర్ సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి వీరవిహారం చేశాడు. మొత్తం 35 బంతులు ఆడి 75 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ 13 బంతులు ఆడి నాలుగు సిక్సులు ఒక ఫోర్ బాదాడు. దీంతో ఏకంగా 34 పరుగులు చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా 18 బంతులు ఆడి 47 పరుగులు చేశాడు. పాండ్యా ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే విఫలం అయ్యాడు. డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత్ ఆరు వికెట్లు నష్టపోయి 297 పరుగులు చేసింది.
అంతర్జాతీయ టీ20 ఫార్మెట్ లో భారత్ కు ఇదే అత్యధిక స్కోర్. అంతర్జాతీయంగా రెండో అత్యధిక స్కోరు కూడా గమనార్హం. గతంలో నేపాల్ 314 పరుగులతో టీ20ల్లో టాప్ స్కోరర్ గా ఉంది.
బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్ సకిబ్ మూడు వికెట్లు, తస్కిన్ అహ్మద్ , ముస్తాఫిజూర్ రెహ్మాన్ , మహ్మదుల్లా తలా ఒక వికెట్ తీశారు.
ఇక 298 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 164 పరుగులు మాత్రమే చేయగల్గింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో తౌహీద్ హృదయ్ (63*), లిట్టన్ దాస్( 42) రాణించారు.
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడువికెట్లు తీయగా, మయాంక్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ , నితీశ్ రెడ్డి చెరొక వికెట్ తీశారు.