పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ఆరోపణలపై తక్షణం చర్య తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. చంద్రబాబు చేసిన ఆరోపణలతో దేశవ్యాప్తంగా భక్తులు, హిందూ సంస్థల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ‘ఎక్స్’ సామాజిక మాధ్యమంలో ‘‘తిరుపతి బాలాజీ ప్రసాదమైన లడ్డూను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువులు స్వామివారి ఆశీర్వాదంగా భావిస్తారు. అందులో జంతువుల కొవ్వు కలుపుతున్నారా. ఆ మాట స్వయానా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడే ప్రస్తావించారు. అదే నిజమైతే అది చాలా తీవ్రమైన విషయం. ఆ దారుణానికి పాల్పడిన దోషుల మీద తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ట్వీట్ చేసారు.
హిందూ సమాజం ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలని బన్సల్ సూచించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇస్లామిక్ జిహాదిస్టులు, ఆహార పదార్ధాల్లో ఉమ్మివేసి హిందువులకు అంటగడుతున్న సంఘటనలతో ఈ సందర్భాన్ని కూడా పోల్చారు.
బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్డిఎ కూటమి ప్రజాప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ గురించి చెప్పుకొచ్చారు. లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులు జంతువుల కొవ్వును వాడారని, ప్రసాదం పవిత్రతను దెబ్బతీసారనీ ఆయన ఆరోపించారు.
చంద్రబాబు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనానికి దారితీసాయి. పెద్దసంఖ్యలో నెటిజన్లు దిగ్భ్రాంతి చెందారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. విశ్వహిందూ పరిషత్తో పాటు పలు హిందూ సంస్థలు ఆ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఆ ఆరోపణలు నిజమని తేలితే వాటికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేసాయి. ప్రసాదం తయారీ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, దాని స్వచ్ఛత విషయంలో ప్రభుత్వం హామీ ఇవ్వాలనీ భక్తులు కోరుతున్నారు.