పారిస్ ఒలింపిక్స్ -2024లో రజత పతకంతో సరిపెట్టుకున్న భారత జావెలిన్ త్రో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ‘డైమండ్ లీగ్’ 2024 ఫైనల్లో రెండో స్థానంలోనే నిలిచాడు. కేవలం ఒక్క సెంటీమీటర్ తేడాతో మొదటి స్థానాన్ని అందుకోలేక వెనకబడ్డాడు.
బ్రస్సెల్స్ వేదికగా డైమండ్ లీగ్- 2024 జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ శనివారం జరిగింది. కరేబియన్ దేశం గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్లతో తొలిస్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్ -2024లో కాంస్య పతకం సాధించిన పీటర్స్ ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా 87.86 మీటర్ల అద్భుతమైన త్రో విసిరినప్పటికీ కేవలం 0.01 మీటర్లు అంటే సెంటీమీటర్ తేడాతో వెనుకంజతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
లాసాన్ డైమండ్ లీగ్లో కూడా నీరజ్ చోప్రా రెండో స్థానంలోనే నిలిచాడు. జర్మనీకి చెందిన అథ్లెట్ జూలియన్ వెబర్ 85.97 మీటర్ల త్రో విసిరి మూడోస్థానంలో నిలిచాడు.