ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం తొసిపుచ్చింది. ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారించాలని కోరుతూ ఆర్కే పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారించిన జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను వేదికగా చేసుకోవడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. పిటిషనర్కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది.
దాదాపు పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఆళ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు తోసిపుచ్చింది.
ఆధార రహిత అంశాలతో పిటీషన్ వేసి కోర్టుతో ఆటలాడుకోవద్దని తీవ్ర వాఖ్యలు చేసింది.ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసుల్లో విచారణ జరుగుతుందని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది జాబితా ఇచ్చారు. అయితే ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.