భూసంస్కరణలు, రైతుల రిజిస్ట్రీ ఏర్పాటు, ఉద్యోగినులకు హాస్టళ్ళ నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు గణనీయమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి సిద్ధమవుతోంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమగ్ర భూ సంస్కరణల అమలుకు ప్రోత్సాహకాలుగా రాష్ట్రాలకు రూ.10వేలకోట్లు కేటాయించడానికి కేంద్రప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. ఆ నిధులను 2024-25లో మూలధన పెట్టుబడిగా ప్రత్యేక సహాయం చేసే పథకం కింద రాష్ట్రాలకు పంచుతారు.
భూముల నిర్వహణను క్రమబద్ధీకరించే దిశలో, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఖరారు చేసి ఆగస్టు 9న రాష్ట్రప్రభుత్వాలకు పంపిణీ చేసింది. జులై 23న తన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాలు పలు సంస్కరణలను అమలు చేయాలి.
గ్రామీణ ప్రాంతాలు: అన్ని భూ విభాగాలకూ యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (భూ-ఆధార్) కేటాయించాలి. భూముల మ్యాప్లను డిజిటైజ్ చేయాలి. ప్రస్తుత యాజమాన్యాల ఆధారంగా సబ్డివిజన్ల మ్యాప్లను సర్వే చేయాలి. సమగ్ర భూ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలి.
పట్టణ ప్రాంతాలు: జిఐఎస్ మ్యాపింగ్ ద్వారా భూముల రికార్డులను డిజిటైజ్ చేయాలి. ఆస్తుల రికార్డుల నిర్వహణ, అప్డేటింగ్, పన్నుల నిర్వహణ కోసం రాష్ట్రాలు ఐటీ వ్యవస్థలను డెవలప్ చేయాలి.
రైతుల రిజిస్ట్రీ: గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూముల మ్యాపింగ్, డిజిటైజేషన్ వ్యవహారాలు కాకుండా రైతుల రిజిస్ట్రీ కోసం అదనంగా మరో 5వేల కోట్లు కేటాయిస్తారు. తద్వారా ఆరు కోట్లమంది రైతులు, వారి భూముల వివరాలు ఈ రిజిస్ట్రీలో ఉంటాయి. దానివల్ల వ్యవసాయ సమాచార నిర్వహణ కచ్చితంగానూ, సమర్థంగానూ ఉండగలదు.
మహిళా ఉద్యోగులకు హాస్టళ్ళు: కేంద్రప్రభుత్వం మహిళా ఉద్యోగులకు హాస్టళ్ళ నిర్మాణం కోసం రూ.5వేల కోట్లు కేటాయించనుంది. ఉద్యోగాలు చేసే మహిళలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీనికోసం రాష్ట్రప్రభుత్వాలు భూమిని కేటాయించాలి లేదా భూసేకరణకయ్యే ఖర్చును భరించాలి. ఈ హాస్టళ్ళ నిర్వహణ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. హాస్టళ్ళు ప్రభుత్వానివి కాగా, వాటి నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించవచ్చు.
వీటితో పాటు మరికొన్ని రంగాలకు కూడా ఆర్థిక సహాయం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది.
చారిత్రక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి : రూ.2వేల కోట్లు
పాత వాహనాల రద్దు ప్రోత్సాహకాలు : రూ.3వేల కోట్లు
పారిశ్రామిక రంగం అభివృద్ధికి : రూ.15వేల కోట్లు
దేశ రాజధాని ప్రాంత అభివృద్ధికి : రూ. వెయ్యి కోట్లు (హర్యానా, యూపీ, రాజస్థాన్లకు సమంగా పంచుతారు)
కేంద్ర ప్రాయోజిత పథకాలు: రూ.15వేల కోట్లు (పట్టణ, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు)
మూలధన వ్యయ లక్ష్యాలు : రూ.25వేల కోట్లు