గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని డైమండ్ పాలిషింగ్ సంస్థలను ఆర్థిక మాంద్యం భయం పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానపెట్టిన వజ్రాలకు డిమాండ్ లేకపోవడంతో పెద్దమొత్తంలో సరుకు నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో కంపెనీలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద నేచురల్ డైమండ్స్ కంపెనీగా పేరొందిన కిరణ్ జెమ్స్ కంపెనీ తన ఉద్యోగులకు పదిరోజుల పాటు సెలవులు ప్రకటించింది. సంస్థలో పనిచేసే 50,000 మంది ఉద్యోగులకు ఈ నెల 17 నుంచి 27 వరకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. వజ్రాల వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న డిమాండ్ను అధిగమించడంతో పాటు ఉత్పత్తిని నియంత్రించే సాధనంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వజ్రాల పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని, ప్రపంచ మార్కెట్లో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ లేదని కిరణ్ జెమ్స్ కంపెనీ చెబుతోంది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చైర్మన్ వల్లభాయ్ లఖానీ అన్నారు.
సూరత్ వేదికగా దాదాపు 4,000 పెద్ద, చిన్న డైమండ్ పాలిషింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సుమారుగా 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.