యూపీఐ వ్యవస్థలో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం గురువారం జరిగింది. ఆ నిర్ణయాలను శక్తికాంత్ దాస్ వెల్లడించారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు జరిపేవారు ఒక ట్రాన్సాక్షన్లో రూ.5 లక్షల వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
యూపీఐ చెల్లింపుల పరిమితిని 2023 డిసెంబర్లోనూ ఆర్బీఐ సవరించింది. వైద్య ఖర్చులు, విద్యాసంస్థల్లో ఫీజులు యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. క్యాపిటల్ మార్కెట్లు, బీమా, రెమిటెన్స్ చెల్లింపుల పరిమితి కూడా రూ.2 లక్షలకు చేసింది.
యూపీఐలో డెలిగేటెడ్ చెల్లింపుల వ్యవస్థను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి నిర్దేశిత పరిమితి వరకు యూపీఐ లావాదేవీలు చేసేందుకు మరొక వ్యక్తికి అనుమతి ఇస్తారు. ఖాతాదారుడి కుటుంబసభ్యులను దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశం కల్పిస్తున్నారు.