ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడటంపై కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ ఈ రోజు లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ఫోగాట్కి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ప్రభుత్వం అందజేసిందని మాండవీయ వెల్లడించారు.
వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హతకు గురైనట్లు తెలిపారు.‘‘ వినేష్ 50 కిలోల విభాగంలో ఆడుతున్నందున ఆమె బరువు 50 కిలోలు ఉండాలి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నియమాలు మరియు నిబంధనల ప్రకారం, అన్ని పోటీల కోసం, సంబంధిత కేటగిరీల్లో ప్రతీరోజూ ఉదయం బరువు చూస్తారని’’ చెప్పారు.
‘‘ఆగస్టు 7, 2024న, 50 కిలోల మహిళల రెజ్లింగ్ పోటీకి సంబంధించి రెజ్లర్లకు పారిస్ టైమ్ 7:15-7:30 గంటలకు బరువు చూశారు. వినేష్ బరువు 50 కిలోల 100 గ్రాములుగా ఉన్నట్లు నిర్ధారించారు. అందువల్ల, ఆమె పోటీకి అనర్హులుగా ప్రకటించారు’’ అని ఆయన సభలో వెల్లడించారు.
వినేష్ ఫోగట్ ఒలింపిక్ ఫైనల్ చేరుకున్న భారతీయ తొలి మహిళగా రికార్డు సృష్టించారు. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనే ముందు ఆమె బరువు నిబంధనల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో దురదృష్టవశాత్తు అనర్హతకు గురైంది .
రెజ్లర్ వినేశ్ ఫోగాట్పై చివరి నిమిషంలో అనర్హత వేటు పడటంపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’వేదికగా స్పందించారు.
“వినేశ్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్!… నీ ప్రతిభ దేశం గర్వించదగ్గది. భారతీయులందరికీ నువ్వు ఓ మార్గదర్శి. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతగానో బాధించింది. విచారం వ్యక్తం చేసేందుకు మాటలు రావడంలేదు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రాగలవని నేను విశ్వసిస్తున్నాను. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అని మోదీ అని ట్వీట్ లో పేర్కొన్నారు.