వచ్చే నాలుగు నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురానుంది. ఆ మేరకు ఆర్డినెన్స్ రూపొందించింది. ఆ మేరకు తీర్మానాన్ని మంగళవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం ఆన్లైన్లో ఆమోదించింది. గవర్నర్ ఆమోదముద్ర తర్వాత ఆర్డినెన్స్ జారీ అవుతుంది. తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆ ఆర్డినెన్స్ను ఆమోదిస్తారు.
2024 మేలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగినందున, అంతకుముందరి వైసీపీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. నాలుగు నెలల వ్యవధికి ఆమోదం పొందింది. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అయితే రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కొత్త ప్రభుత్వం భావించింది. రాష్ట్ర స్థితిగతుల గురించి శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బదులు, మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చింది. దాన్ని ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెడతారు.
పాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జులై 31తో ముగిసిపోతుంది. ఆగస్టు నుంచి నవంబర్ వరకూ నాలుగు నెలలకు కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమలవుతుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశపెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి.