శ్రీలంక తో ఆడుతున్న వైట్బాల్ సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది.ఛేదనలో భాగంగా శ్రీలంక ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక 79, కుశాల్ మెండిస్ 45 పరుగులు భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 14 ఓవర్లలో 140 పరుగులు చేసింది. ఆ తర్వాత లంకేయుల పతనం మొదలైంది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది.
కెప్టెన్ చరిత్ అసలంక (0), మాజీ కెప్టెన్ దసున్ షనక (0) పెవిలియన్ చేరడం శ్రీలంక విజయావకాశాలను భారీగా దెబ్బతీసింది. కుశాల్ పెరీరా 20, కమిందు మెండిస్ 12 పరుగులు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితయ్యారు.
భారత బౌలర్లలో పార్ట్ టైమ్ బౌలర్ రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టగా అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ , రవి బిష్ణోయ్ కు ఒక్కో వికెట్ దక్కింది.
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. కాగా, భారత్ హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం కూడా విజయంతో ప్రారంభమైంది.