దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పరీక్షను మళ్ళీ నిర్వహించే అంశంపై వాదనలు ముగియగా, సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని నిర్ధారించిన సుప్రీం ధర్మాసనం, బిహార్ లోని హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైనట్లు పేర్కొంది. 150 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ తో లబ్ధి పొందారని తెలిపింది.
దేశమంతా నీట్ పేపర్ లీకైనట్టు ఆధారాలు లేవని, అందువల్ల నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నీట్ రద్దు చేయాలన్న వాదనలో అర్థం లేదని తేల్చిచెప్పింది. పరీక్ష రద్దు చేస్తే 24 లక్షల మందిపై ప్రభావం పడుతుందని వివరించింది. పేపర్ లీక్ తో లబ్ధిపొందిన విద్యార్థులు పై చర్యలు తీసుకోవడంతో పాటు నీట్ నిర్వహణలో లోపాలపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పుతో నీట్ యూజీ ప్రవేశాల కౌన్సిలింగ్ కు అడ్డంకులు తొలిగాయి.