కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థలో అందరికీ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా యువత, పేదలు, రైతులు, మహిళలకు లబ్ది చేకూర్చే అనేక పథకాలను ప్రవేశపెట్టారు. తొమ్మిది అంశాలకు భారీ కేటాయింపులు చేశారు.
దేశంలోని 500 పెద్ద కంపెనీల్లో కోటి ఉద్యోగాల కల్పనకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వారికి ఉద్యోగాలు కల్పించడం, వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచడం, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. మౌలిక సదుపాయాల వృద్ధికి రూ.11 లక్షల కోట్లు కేటాయించారు. ఇంధన భద్రత, పరిశోధనలు, ఆవిష్కరణలు, సేవలు, తయారీ రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం ద్వారా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి కోట్లాది మందికి ఉపాధి కల్పించనున్నారు.
కోటి మంది రైతులకు సేంద్రీయ సాగుపై శిక్షణ ఇవ్వడంతోపాటు, ఉత్పాదకతను పెంచే 109 కొత్త వంగడాలను పరిచయం చేయనున్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఇప్పటికే మద్దతు ధరలు 50 శాతం దాకా పెంచారు. కూరగాయల ఉత్పత్తికి క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించారు.