Palestinian Flags in Harvard University
అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా అనుకూల
నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత వారాంతంలో అధికారులు సమారు 275మందిని అరెస్టు చేసారంటే
అమెరికన్ యూనివర్సిటీల్లో పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్ధమవుతుంది. సుమారు వారం
రోజుల క్రితం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మొదలైన నిరసనలు చాలా
వేగంగా దేశమంతా వ్యాపించాయి.
ఏడు నెలల క్రితం హమాస్ ఉగ్రవాద సంస్థ చేసిన
దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధం అమెరికాలోని పాలస్తీనా
అనుకూల వర్గాలకు, మరింత స్పష్టంగా చెప్పాలంటే ముస్లిములకు, తీవ్ర ఆగ్రహం
కలిగిస్తోంది. దాంతో అమెరికన్ విశ్వవిద్యాలయాలలోని ముస్లిములు నిరసన కార్యక్రమాలు
చేపడుతున్నారు.
తాజాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఐవీ లీగ్
స్కూల్లో ఆందోళనకారులు పాలస్తీనా జెండా ఎగరేసారు. సాధారణంగా అమెరికా జాతీయ పతాకం
ఎగరవేసే ప్రదేశంలో పాలస్తీనా జెండా ఎగురవేసారు. అంతేకాకు, ప్రతీ యేడాదీ వైట్హౌస్
కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరిగే వాషింగ్టన్ హిల్టన్ హోటల్ పై అంతస్తులోని
కిటికీ నుంచి అతిపెద్ద పాలస్తీనా జెండాను ఎగురవేసాము.
నాలుగు వేర్వేరు క్యాంపస్ల నుంచి పోలీసులు 275
మందిని అరెస్ట్ చేసారు. బోస్టన్లోని నార్త్ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలో 100 మందిని,
సెయింట్లూయీలోని వాషింగ్టన్ యూనివర్సిటిలో 80మందిని, ఆరిజోనా స్టేట్
యూనివర్సిటీలోని 72మందిని, ఇండియానా యూనివర్సిటీలో 23మందిని అరెస్ట్ చేసారు.
ఇక అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూల, పాలస్తీనా
అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నిరసనలు, ఘర్షణలూ
అధ్యక్ష భవనం వరకూ చేరాయి. ఆందోళనకారులు శాంతియుతంగా తమ ప్రదర్శనలు చేసుకోవాలని వైట్హౌస్
ఒక ప్రకటన విడుదల చేసింది.
విశ్వవిద్యాలయాల్లో ఈ నిరసనలు చేపడుతున్నవారు
ఇజ్రాయెల్ తమ యుద్ధాన్ని తక్షణం విరమించుకోవాలని పిలుపు ఇస్తున్నారు. ఆ దేశంతో
అమెరికన్ కళాశాలలు తమ సంబంధాలను తెంచేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గాజా
సంక్షోభంతో కొన్ని కంపెనీలు లబ్ధి పొందుతున్నాయనీ, అలాంటి కంపెనీలను కూడా కాలేజీలు
దూరం పెట్టాలనీ డిమాండ్ చేస్తున్నారు.
ఆ ఆందోళనలు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలకు
తలనొప్పులు కలిగిస్తున్నాయి. భావప్రకటనా స్వేచ్ఛకు అవకాశం కలిగిస్తే ద్వేష
ప్రసంగాలతో జాతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుండడం పెద్ద సమస్యగా మారింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం నాడు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. గాజా సరిహద్దు
నగరం రఫాను ఆక్రమించుకునే అవకాశం మీద అమెరికా విధానాన్ని మరోసారి స్పష్టం చేసారు.
గత అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద
దాడులు చేసిన ఘటనలో 1170మంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా మరో 250 మందిని
ఎత్తుకుపోయారు. దాంతో ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం మొదలుపెట్టింది. ఆ యుద్ధంలో సుమారు
3500మంది ప్రాణాలు కోల్పోయారు.