Narasannapeta Assembly Constituency Profile
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట… మండలం, మండలకేంద్రం, శాసనసభా నియోజకవర్గంగా
ఉంది. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పడింది. నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి అనే
నాలుగు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
నరసన్నపేట నియోజకవర్గం సాంప్రదాయికంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. తెలుగుదేశం
పార్టీ వ్యవస్థాపన సమయంలో జరిగిన ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. 1994లోనూ, ఆ
తర్వాత 2014లోనూ తెలుగుదేశం గెలిచింది. మిగిలిన అన్నిసార్లూ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ
విజయం సాధించాయి.
నరసన్నపేట ప్రధానంగా రెండుమూడు రాజకీయ కుటుంబాల మధ్యనే ఉంది. పార్టీలు
ఏవైనా, ఆ కుటుంబాలే శాసనసభకు ఎన్నికవుతూ వస్తున్నాయి. అందులో ధర్మాన కుటుంబం ముఖ్యమైనది. 1999లో ధర్మాన ప్రసాదరావు
ఇక్కడినుంచి పోటీచేసి గెలిచారు. తర్వాత ఆయన శ్రీకాకుళానికి మారారు. నరసన్నపేట నుంచి
ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసే పోటీ చేసి గెలుస్తున్నారు.
2024 శాసనసభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి తరఫున ధర్మాన కృష్ణదాస్
మరోసారి పోటీపడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎన్డిఎ కూటమి నుంచి తెలుగుదేశం
అభ్యర్ధిగా బగ్గు రమణమూర్తి బరిలోకి దిగుతున్నారు. ఇక ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
తరఫున మంత్రి నరసింహమూర్తి నిలబడుతున్నారు.