రాష్ట్రీయ
జనతాదళ్ పార్టీ(RJD) తో పాటు ఇండీ కూటమిలోని ఇతర పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి
తీవ్రవిమర్శలు చేశారు. అవినీతికి రెండోపేరు ప్రతిపక్ష పార్టీలు అంటూ ప్రధాని
నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల
ప్రచారంలో భాగంగా బిహార్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, గయలో ఎన్డీయే అభ్యర్థి జీతన్రామ్
మాంఝీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ బిహార్ దయనీయ
స్థితికి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పాలనే కారణమన్నారు.
ఎన్నో
ఏళ్ళ పాటు బిహార్ ను పాలించిన ఆర్జేడీకి
ఆపార్టీ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చించే దమ్ము లేదని ప్రధాని మోదీ
దుయ్యబట్టారు.
బిహార్ విధ్వంసం ఆర్జేడీ పాపమేనని ఆరోపించారు. ఆటవిక పాలన, అవినీతికి పర్యాయపదంగా ఆర్జేడి
మారిందన్నారు. మహిళలు రాత్రి సమయాల్లో ఇళ్ళ నుంచి బయటకు వచ్చేందుకు జంకేవారని గుర్తు
చేసిన ప్రధాని మోదీ, విపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్
కుమార్, కేంద్రప్రభుత్వ సహకారంతో జరిగిన అభివృద్ధిని చూపుతూ విపక్షాలు ఓట్లు
అడుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
అయోధ్య
రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న
ఇండీ కూటమి బహిష్కరించిందని గుర్తు చేసిన ప్రధాని మోదీ, కేవలం ఓ వర్గాన్ని
బుజ్జగించేందుకే ఇండీ కూటమి రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
గాంధీ చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలు, డీఎంకే యువనేత ఉదయనిధి సనాతన ధర్మాన్ని మలేరియా,
డెంగీతో పోల్చడాన్ని ప్రధాని, బిహార్ ప్రజలకు వివరించారు. అనంతరం బీజేపీ మేనిఫెస్టోలోని
హామీలను ప్రజలకు వివరించారు.