మాల్దీవుల్లో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు భారత్లో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నారు. ఇదేంటి మాల్దీవుల్లో ఎన్నికలు జరిగితే భారత్లో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయడం ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే. కేరళలో మాల్దీవుల ప్రజలు పెద్ద ఎత్తున నివశిస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 21న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు తిరువనంతపురంలో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నారు. భారత్తో పాటు మాల్దీవుల ప్రజలు అధికంగా నివశించే శ్రీలంక, మలేషియాల్లోనూ బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు మాల్దీవుల ఎన్నికల అధికారి ప్రకటించారు.
గత ఎన్నికల్లో శ్రీలంక, మలేషియా నుంచి మాత్రమే అభ్యర్థనలు వచ్చాయి. ఈసారి తిరువనంతపురంలో కూడా బ్యాలెట్ బాక్సు ఏర్పాటు చేయాలని మాల్దీవుల ప్రజలు కోరడంతో, అందుకు ఆదేశ ఎన్నికల అధికారి అంగీకరించారు. మాల్దీవుల పార్లమెంట్లోని మొత్తం 93 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అధ్యక్షుడు ముయిజ్జు కూటమి 89 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది.