ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన చేయగా, ఆయన కుమారుడైన సీఎం జగన్, నేడు ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని 30 మండలాలలోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేసే అవకాశముంది.
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలోని కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్ సమస్యకు కూడా పరిష్కారం దొరకనుంది.
వచ్చే సీజన్ లో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగులకు చేరుకున్న తర్వాత వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్ కు నీటిని తరలిస్తారు.
నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా ప్రకాశం జిల్లాలో విస్తరించిన కొండలనే వెలిగొండలు అంటారు. ఈ ప్రాంతంలో మూడు డ్యామ్ లు నిర్మించడంతో నల్లమల సాగర్ ఏర్పడింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రెండు సొరంగాలు తవ్వారు. రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచారు. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కిలోమీటర్ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు.