బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తికావడంతో అయోధ్య రామాలయం భక్తులకు (ayodya ram temple darsan) అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నుంచి అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. సోమవారం ముఖ్య అతిథులను మాత్రమే అనుమతించారు. ఇక నుంచి ఎవరైనా రాములోరిని దర్శించుకోవచ్చు. ఏటా 5 కోట్ల మంది అయోధ్య రామయ్యను దర్శించుకుంటారని అంచనా.
అయోధ్య రామాలయంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మరలా మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు జాగరణ హారతి ఉంటుంది. అయితే ఒక రోజు ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఇక రాత్రి 7 గంటల 30 నిమిషాలకు సంధ్యా హారతి దర్శనం చేసుకోవచ్చు. ఒక రోజు ముందే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
భక్తులు నేరుగా అయోధ్యకు వెళ్లి బాలరాముడిని దర్శించుకోవచ్చు. ప్రత్యేక దర్శనాలకు మాత్రం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. మొబైల్ నెంబరుతో సైన్ఇన్ కావాలి. ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఒకసారి లాగిన్ అయితే తరువాత మై ప్రొఫైల్ సెక్షన్లో మీ గుర్తింపు, చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది. హారతి, దర్శనం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.టికట్లు బుక్ చేసుకున్న వారికి ఆలయ ప్రాంగణంలో పాసులు జారీ చేస్తారు.