అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ వేళ అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ రామనామ జపంతో మార్మోగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠను ప్రత్యక్షంగా
వీక్షించేందుకు వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో టైమ్స్ స్క్వేర్ మార్మోగుతోంది. టైమ్స్ స్క్వేర్లోని భారీ బిల్బోర్డుపై రాముడి చిత్రాలుంచారు. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ లైవ్ ప్రసారం చూడటానికి వేలాది మంది తరలి వచ్చారు.
జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబట్టి వేలాది మంది భారతీయులు టైమ్స్ స్క్వేర్ కూడలికి చేరుకున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ వొర్సెస్టర్ నగర మేయర్ జో పెట్టీ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. టైమ్స్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
మరి కాసేపట్లో అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ (ayodya ramalaya pran pratistha) జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మొదలై ఒంటిగంటకు కార్యక్రమం ముగియనుంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి 7 వేల మంది ప్రముఖులు అయోధ్యలోని రామాలయం వద్దకు చేరుకున్నారు. వేలాది మంది స్వామీజీలు, సాధువులు అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు నగరాన్ని సుందరంగా అలంకరించారు.