అయోధ్య రామమందిరానికి అరుదైన గౌరవం దక్కింది. రామాలయం పోటోతో కూడిన పోస్టల్ స్టాంప్ను ప్రధాని మోదీ (pm modi ayodya ramalaya temple stamp releases) గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. హనుమంతుడు, గణనాథుడు, జటాయువు, కేవత్రాజ్, శబరిమాతపై మొత్తం ఆరు స్టాంపులను ఒకేసారి విడుదల చేశారు. అయోధ్యలోని రామాలయ ఆకృతి, మందిరం ఆవరణలోని కళాఖండాలు, సూర్యభగవానుడు, సరయూ నది ప్రవాహం ప్రతిబింబించేలా స్టాంపులు రూపొందించారు. వీటిపై మంగళ్ భవన్ అమంగళ్ హరి అనే పదాలు కూడా ముద్రించారు.
శ్రీరాముడిపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే విడుదలైన స్టాంపులతో కూడిన పుస్తకాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 20 దేశాలకు చెందిన 48 పేజీల పుస్తకంలో అనేక స్టాంపులను పొందుపరిచారు. అమెరికా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్, కాంబోడియా దేశాలు సహా అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి కూడా శ్రీరాముడిపై స్మారక స్టాంప్లను విడుదల చేశాయి. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారత వాతావరణ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్యలో వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు అందించనుంది.