Festive Lunch for Newly Married with 250 Delicacies
తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి పెద్ద పండుగ. వ్యవసాయ
ప్రధానమైన మన రాష్ట్రంలో మరే ఇతర పండుగకూ లేని వైభోగం సంక్రాంతిదే. (Makar
Sankranti) పంటలు చేతికి వచ్చే సమయంలో చేసుకునే పండుగ కాబట్టి ఇంత ఘనంగా, వైభవంగా
చేసుకునే పండుగ ఇంకొకటి ఏదీ లేదు. అందుకే ఈ సమయంలో కొత్త అల్లుళ్ళను ఘనంగా
సత్కరించుకోవడం ఆనవాయితీ. (Newly Married Couple)
మిగతా పండుగల్లో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటే సంక్రాంతిలో
వేడుకలు ఎక్కువ. ఇంక వ్యవసాయ ఆధారితమైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంత జిల్లాల్లో
ఆ వేడుకలు ఎంత ఘనంగా ఉంటే అంత ప్రతిష్ఠగా భావిస్తారు. పైపెచ్చు, కొత్తగా పెళ్ళయిన
అమ్మాయిల పుట్టింటి బంధువులు అందరూ, ఆ కొత్తజంటలను పిలిచి ఘనంగా సంబరాలు చేస్తారు.
కొత్త అల్లుళ్ళకు చేసే మర్యాదలు, వారికి పెట్టే భోజనాలూ ఎప్పటికప్పుడు కొత్తగా
చెప్పుకునే కథలే.
అలాంటి ఘట్టమే ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో
కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో చోటు చేసుకుంది. మొదటి సంక్రాంతి పండుగకు
అత్తారింటికి వచ్చిన అల్లుడికి ఏకంగా 250 రకాల వంటకాలతో విందు (Lunch with
250 delicacies) వడ్డించారు. ఆ వివరాలేమిటో చూసేద్దామా.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన దివంగత
గుర్రం సుబ్బారావు, శేషుకుమారి దంపతుల కుమార్తె నవ్య. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామానికి
చెందిన కాగిత రామాంజనేయులు, నాగమణి దంపతుల కుమారుడు రేవంత్. రేవంత్ కేరళలోని
ఎర్నాకుళంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు.
నవ్య, రేవంత్లకు గత మే నెలలో పెళ్ళి జరిగింది.
నవ్య, రేవంత్ జంటకు
పెళ్ళి తర్వాత ఇదే మొదటి సంక్రాంతి కావడంతో ఇంటల్లుడికి ఘనంగా మర్యాదలు చేయాలని
నవ్య సోదరుడు సాయినాథ్ భావించాడు. ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలోని తమ మేనమామ
వాసు ఇంట్లో కొత్త దంపతులకు ఆతిథ్యానికి ఏర్పాట్లు చేసాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా
250 వంటకాలతో విందు ఇచ్చాడు. నవ్య అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కుటుంబం ఆధ్వర్యంలో కొత్త
దంపతులను ఘనమైన విందుభోజనంతో అలరింపజేసారు.