Transgender Sadhus take holy dip at Prayagraj and leave
for Ayodhya
మకర సంక్రాంతి (Makar Sankranti) పర్వదినం
సందర్భంగా ట్రాన్స్జెండర్ సాధ్వులు (Transgender Sadhus) ప్రయాగ్రాజ్లోని
(Prayag Raj) త్రివేణీసంగమంలో పవిత్రస్నానం (Holy Dip) చేసారు.
అక్కడినుంచి వారు అయోధ్యకు (Ayodhya) బయల్దేరారు. జనవరి 22 ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమంలో వారు పాల్గొంటారు.
మకర సంక్రాంతి లేదా మాఘమేళా సందర్భంగా త్రివేణీసంగమక్షేత్రం
ప్రయాగలో లక్షలాది భక్తులు పవిత్రస్నానాలు ఆచరించారు. వారిలో హిజ్రా సాధ్వీమణులు కూడా
ఉన్నారు. ప్రయాగలో స్నానం పూర్తిచేసుకుని వారు నేరుగా అయోధ్యకు బయల్దేరారు.
కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్, ఉత్తరప్రదేశ్
కిన్నర్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యురాలూ అయిన కౌసల్యానంద గిరి అయోధ్య రామమందిర
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వానం అందుకున్నారు. ‘‘అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం
రావడం మమ్మల్ని ఉద్వేగానికి గురిచేసింది. మాకు శ్రీరామచంద్ర ప్రభువుతో ప్రత్యేకమైన
సంబంధం ఉంది. రాముడు వనవాసానికి వెడుతున్నప్పుడు ఆయనకు మా హిజ్రాలే వీడ్కోలు
పలికారు. ఆయనతోపాటు వారు కూడా వనవాసం చేసారు. అందుకే ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు.
కలియుగంలో మా దీవెనల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని రాముడు మాకు వరమిచ్చారు’’ అని
కౌసల్యానంద్ గిరి చెప్పారు.
అయోధ్య ప్రాణప్రతిష్ఠకు
తమకు ఆహ్వానం పంపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు
ఆమె ధన్యవాదాలు తెలియజేసారు. ‘‘ఎన్నో యేళ్ళ తర్వాత మాకు ఆహ్వానం అందింది. మా
సంతోషానికి, మా కృతజ్ఞతకూ అవధులు లేవు. మేమందరం భజనలూ, కీర్తనలతో రాముడికి పూజలు
చేస్తున్నాం. రాజ్యాంగంలో మాకు చోటు ఉండి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాకు ధార్మిక
కార్యక్రమాల్లో సైతం గుర్తింపు లభించింది’’ అని కౌసల్యానంద్ గిరి హర్షం వ్యక్తం
చేసారు.