Ram Devotees Rally in Tripura, Ram Katha in Mauritius Temples
ఈశాన్యభారతం సైతం రామనామంతో పులకరించిపోతోంది.
అయోధ్యలో నూతన రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా త్రిపుర రాష్ట్రంలో
రామభక్తులు యాత్ర చేపట్టారు.
ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని వివిధ ప్రాంతాల రామభక్తులు
ఇవాళ ఆదివారం రాష్ట్ర రాజధాని అగర్తలాలోని స్వామి వివేకానంద మైదానంలో సమావేశమయ్యారు.
సమావేశానికి ముందు ర్యాలీ నిర్వహించారు. అందులో పాల్గొన్న భక్తులు చేసిన జైశ్రీరామ్
నినాదాలతో వాతావరణమంతా విద్యుత్తరంగితమైపోయింది.
ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో చిత్తా మహరాజ్,
గాయమణి బ్రహ్మచారి, కార్తీక్ ప్రభు వంటి సాధువులు పాల్గొన్నారు. వారు చేసిన రామనామ
స్మరణం, వినిపించిన రామకథా శ్రవణంతో శ్రోతలందరూ ఉత్తేజితులయ్యారు.
ఇంకొక్క వారం రోజుల్లో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
జరగనుంది. ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి
అతిథులు పాల్గొంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మారిషస్లోని అన్ని
దేవాలయాల్లో రామకథాగానం నిర్వహిస్తున్నారు.
‘‘జనవరి 15 మకర సంక్రాంతి పర్వదినం నుంచీ మారిషస్లోని
అన్ని మందిరాల్లోనూ రామాయణ గానం మొదలైంది. ఈ 22న మేము దీపావళి జరుపుకుంటున్నాము. ఈ
యేడాది రెండు దీపావళులు జరుపుకుంటాం. రామాయణంలో వనవాసం పూర్తిచేసుకున్నాక 14ఏళ్ళ
తరవాత రాముడు అయోధ్యకు చేరుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీరామచంద్ర ప్రభువు
500 ఏళ్ళ తర్వాత అయోధ్యకు చేరుకుంటున్నాడు. ఇది చాలా గొప్ప పర్వదినం’’ అని మారిషస్
సనాతన ధర్మ టెంపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు భోజరాజ్ ఘూర్బిన్ వివరించారు.