Giant billboards displaying
Ram Mandir in the USA
భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో
అయోధ్యానగరంలో శ్రీరామచంద్రమూర్తి నూతన ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
(Ayodhya Consecration Ceremony) జనవరి 22న జరుగుతోంది. ఆ సందర్భం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
కలిగిస్తోంది. వివిధ దేశాలలోని భారతీయులు ఆ కార్యక్రమాన్ని గొప్పగా భావిస్తున్నారు.
ఆ చారిత్రాత్మక సందర్భాన్న ప్రత్యక్షంగా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
భారతీయులు ఎక్కువమంది ఉన్న దేశాల్లో అమెరికా
అగ్రస్థానంలో ఉంటుంది. సహజంగానే అగ్రరాజ్యంలోని ప్రవాస భారతీయులు స్వదేశంలో జరుగుతున్న
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై అమిత ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భాన్ని
పురస్కరించుకుని విశ్వహిందూపరిషత్ అమెరికా శాఖ (VHP US Chapter) ఆ దేశంలోని 10కి పైగా రాష్ట్రాల్లో 40 బిల్బోర్డులు (40 Billboards in 10+ US states) ఏర్పాటు చేసింది.
టెక్సాస్, ఇల్లినాయ్, న్యూయార్క్,
న్యూజెర్సీ, జార్జియా, ఆరిజోనా, మిస్సోరీ తదితర రాష్ట్రాల్లో బిల్బోర్డులు
ఏర్పాటు చేసారు. వాటిపై అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ గురించిన వివరాలు ప్రదర్శిస్తున్నారు.
అంతేకాదు, కొన్నిచోట్ల ఆరోజు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
‘‘ఈ బిల్బోర్డులు బిగ్గరగా
వినిపిస్తున్న సందేశం ఏంటంటే అమెరికాలోని హిందువులు ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ జీవితకాలంలో
ఒకేసారి వచ్చే అద్భుతమైన అపురూపమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారు.
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే ఆ పవిత్రమైన రోజు కోసం ఉద్వేగంగా, ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు’’
అని, హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా ప్రధానకార్యదర్శి అమితాభ్ మిట్టల్ చెప్పారు.
విశ్వహిందూ పరిషత్, అమెరికా శాఖ సంయుక్త
ప్రధాన కార్యదర్శి తేజా షా ‘‘న్యూజెర్సీలోని హిందూసమాజం సంతోషంలో మునిగితేలుతోంది.
ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఆరోజు ఇక్కడ కార్ ర్యాలీ,
ఎగ్జిబిషన్, కర్టెన్ రైజర్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. న్యూజెర్సీ రాష్ట్రంలో
ఉన్న అన్ని దేవాలయాల సభ్యులు ఆ చారిత్రక ఘట్టం సందర్భంగా ఘనంగా వేడుక
జరుపుకునేందుకు తహతహలాడుతున్నారు’’ అని చెప్పారు.
బుధవారం నాడు వాషింగ్టన్ డీసీలోని అమెరికా
పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్లో
(Capitol Hill in Washington DC) ‘రామాయణ
ఎక్రాస్ ఏషియా అండ్ బియాండ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరిగింది. (Special Event on Ramayana) అమెరికాలో భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధూ ఆ కార్యక్రమంలో
మాట్లాడుతూ వివిధ భౌగోళిక ప్రదేశాలను అనుసంధానం చేసే వారధి రామాయణం అని చెప్పారు. మానవ
సంబంధాలలోని సంక్లిష్టతల గురించి, మంచిచెడుల మధ్య నిరంతరం జరిగే పోరాటం గురించి
రామాయణం ప్రజలకు బోధిస్తుందని వివరించారు.
‘‘ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలు రామాయణ సంస్కృతిని
ఉమ్మడిగా పంచుకుంటాయి. రామాయణంలోని కథలు, అది బోధించే పాఠాలూ ముందు తరాల నుంచి
తర్వాతి తరాలకు వారసత్వంగా అందుతూనే ఉన్నాయి. రామాయణం నుంచి పాఠాలు నేర్చుకోరు, ఆ
పాఠాలు పుట్టుకతోనే అందుతుంటాయి. ఆ మహాకావ్యం మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలను
వివరిస్తుంది. పరిపాలన, ఆధ్యాత్మికత, ధర్మం, న్యాయం, త్యాగం, విధేయత వంటి లక్షణాలను
తెలియజేస్తుంది. మంచికీ చెడుకీ మధ్య నిరంతరాయంగా జరిగే ఘర్షణను ప్రతిబింబిస్తుంది.
రామాయణం వివిధ దేశాల మధ్య వారధిగా కూడా ఉంది. ఆ కావ్యంలోని కథలు ఇండోపసిఫిక్
ప్రాంతంలోని దేశాల్లో విస్తృత ప్రాచుర్యంలో ఉన్నాయి. కాంబోడియా నుంచి ఇండోనేసియా
వరకూ, థాయ్లాండ్ నుంచి లావోస్ వరకూ రామాయణ గాథలు తెలియనివారు లేరు. ఆ
మహాకావ్యాన్ని వివిధ దేశాల కవిపండితులు వివిధ రూపాల్లో ఊహించారు, పునఃసృజించారు.
తమ కళల్లోనూ సాహిత్యంలోనూ మత సంప్రదాయాల్లోనూ తమదైన సాంస్కృతిక రూపాల్లో
ఆవిష్కరించారు’’ అని తరణ్జీత్ సింగ్ సంధూ వివరించారు.