కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నట్లు విస్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. జనవరి 31న ప్రారంభమై, ఫిబ్రవరి 9న వరకు సమావేశాలు జరిగే అవకాశముంది. అధికారికంగా షెడ్యూల్ విడుదల (union budget sessions) కావాల్సి ఉంది. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే 2 ప్రభుత్వానికి ఇది ఆఖరి బడ్జెట్. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ అంటే తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఖర్చులకు ఓటాన్ బడ్జెట్ ద్వారా పార్లమెంట్ అనుమతి పొందనున్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఈ విధానం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ బడ్జెట్లో భారీ తాయిలాలు ఉండే అవకాశముందనే అంచనాలున్నాయి. పీఎం కిసాన్ సాయాన్ని రెట్టింపు చేస్తారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.