పార్లమెంటులో
భద్రతా ఉల్లంఘన ఘటనను నిరసిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలూ వాయిదా
పడ్డాయి. ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రుల వివరణ కోసం విపక్షాలు పట్టుబట్టాయి.
లోక్సభ సెక్యూరిటీ అంశం సెక్రెటేరియట్ పరిధిలో ఉంటుందని స్పీకర్ ఓంబిర్లా
తెలిపినా ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు.
దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు వెల్ లోకి
దూసుకెళ్ళి నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభను కూడా చైర్మన్ వాయిదా వేయాల్సి
వచ్చింది.
టీఎంసీ
రాజ్యసభ సభ్యడు డెరెక్ ఒబ్రియన్ సభ నుంచి
ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు. వెల్ లోకి దూసుకొచ్చి గట్టిగా నినాదాలు
చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కల్పించడంతో ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు.
ఒబ్రెయిన్ సస్పెన్షన్ విపక్షాలు ఖండించాయి.
పార్లమెంటులో
భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. ముందస్తు తనిఖీలు
నిర్వహించి మీడియా సిబ్బందికి పాసులు జారీ చేస్తున్నారు. పార్లమెంటుకు వచ్చే ప్రతీ
ఒక్కరి బూట్లను కూడా స్కాన్ చేస్తున్నారు. భద్రతా వైఫల్యంపై లోక్సభ సెక్రటేరియట్ చర్యలు
చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్
చేసినట్లు ప్రకటించారు.
పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ,
ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు
కేంద్రమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పార్లమెంటుపై
ఉగ్రవాదులు దాడికి పాల్పడి 22 ఏళ్ళు అయిన రోజే దుండగులు లోక్సభలో అలజడి
సృష్టించడంపై దర్యాప్తు జరుగుతోంది.
స్పీకర్ ఆదేశాల మేరకు దర్యాప్తు కమిటీని
నియమిస్తూ కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉపా చట్టం కింద దిల్లీ పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి
తీసుకోగా మరొక వ్యక్తి పరారీ లో ఉన్నాడు. నిందితులంతా పక్కా ప్రణాళిక మేరకే దాడికి
పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.