రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఐదోసారి వరుసగా వడ్డీరేట్లు స్థిరంగా కొనసాగించింది. బుధవారం ముంబైలో జరిగిన ఆర్బిఐ (reserve bank of india) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలకు శక్తికాంత్ దాస్ ఇవాళ మీడియాకు వెల్లడించారు.
అంచనాలను మించి వృద్ధి రేటు నమోదు కోబోతోందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ముందుకు సాగుతున్నట్లు సంకేతాలిచ్చారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం దూకుడుమీదుంది. ఆర్థిక పునాదులు బలంగా ఉన్నట్లు ఆర్బిఐ అంచనా వేసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలు 6.5 నుంచి 7 శాతానికి పెంచుతున్నట్లు ఆర్బిఐ ప్రకటించడం విశేషం.