Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ వద్ద పోలీసు పహారా
కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు పెద్ద సంఖ్యలో డ్యామ్ వద్ద మోహరించారు.
ఆంధ్రప్రదేశ్ వైపు దాదాపు 1200 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా పల్నాడు
ఎస్పీ రవిశంకర్ రెడ్డి అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కృష్ణా
బోర్డు అధికారులు కూడా సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని తాజా పరిస్థితిపై సమీక్షించారు.
ఏపీ అధికారులు, సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 522
అడుగుల నీటిమట్టం ఉండగా, మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరుతుంది.
ఆంధ్రప్రదేశ్
పోలీసులపై తెలంగాణలో కేసు నమోదైంది. అమనుతి లేకుండా డ్యామ్ పరిసరాల్లోకి
ప్రవేశించి, కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి
ప్రాజెక్టు పరిసరాల్లోకి చొరబడి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో
తెలిపారు.
రాష్ట్ర
విభజన సమయంలో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వం, శ్రీశైలం
జలాశయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ కు , నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణను
తెలంగాణకు అప్పగించింది. అయితే శ్రీశైలంలో ఎడమ విద్యుత్తు కేంద్రాన్ని తెలంగాణ
ప్రభుత్వమే నిర్వహించుకుంటుంది.
నాగార్జునసాగర్
ప్రాజెక్టుకు సంబంధించి 26 గేట్లు ఉండగా, 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో
ఉన్నాయి. కుడి కాలువ నీళ్ళు కూడా తెలంగాణనే విడుదల చేస్తోంది. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ
చేసినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉన్నాయి.
ఈ వివాదంపై ఏపీ ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి
రాంబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వం చర్య న్యాయమైనదేనని..తమ ప్రభుత్వం ఏమాత్రం
తప్పుచేయలేదన్నారు. తమ సాగునీటి వాటాను వాడుకునేందుకు తెలంగాణ అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు.
తెలంగాణ రాజకీయాలతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. న్యాయంగా తమకు రావాల్సిన వాటానే
విడుదల చేశామన్నారు.