నాగార్జునసాగర్
ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన
తర్వాత డ్యామ్ కు ముళ్ళ కంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగభాగమైన 13వ
గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందంటూ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.
పలువురు
పోలీసు ఉన్నతాధికారులతో పాటు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్ ప్రాజెక్టు వద్దకు
వెళ్లారు. అడ్డుకున్న ఎస్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాలు
ధ్వంసం చేశారు. తర్వాత ముళ్ళ కంచెను ఏర్పాటు చేసి డ్యామ్ ను స్వాధీనం
చేసుకున్నారు.
సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి
డ్యామ్ పైకి చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. ముళ్ళ కంచెను తీసేయాలని సూచించారు.
ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో ఆయన వెనుదిరిగారు.
ఈ ఉదయం ప్రాజెక్టు నుంచి ఏపీ అధికారులు నీటిని కూడా విడుదల చేశారు.
రాష్ట్ర విభజన లో భాగంగా నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్
బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. నీటి విడుదల, భద్రత చర్యలను తెలంగాణ
ప్రభుత్వమే చూసుకుంటుంది.