ఢిల్లీ, ముంబై వాసులను వాయు కాలుష్యం (delhi air polution) కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రెండు నగరాల్లో నివశిస్తోన్న వారిపై ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన సర్వే ఆందోళనకర ఫలితాలిచ్చింది. ఢిల్లీ, ముంబై వాసుల్లో ప్రతి పది మందిలో ఆరుగురు వేరే ప్రాంతాల్లో స్థిరపడాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఢిల్లీ, ముంబై వాసులు వాయు కాలుష్యంతో నిరంతరం దగ్గు, శ్వాస ఆడకపోవడం, గురక, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ప్రతి పది మందిలో తొమ్మిది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు ఆస్తమా, బ్రాంకైటిస్లతో ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం ఈ సమస్య మరింత తీవ్రం అవుతోంది.
వాయు కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఇళ్లు వదలి బయటకు కూడా రావడానికి జంకుతున్నారని సర్వేలో తేలింది. నడక, వ్యాయామాలకు కూడా వెళ్లడం మానేస్తున్నట్లు 35 శాతం మంది చెప్పారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లే వారిలో 30 శాతం మంది మాస్కులు ధరించి తిరుగుతున్నారు. ఢిల్లీ, ముంబై వాయు కాలుష్యం ఇలాగే పెరిగిపోతే అక్కడ నివాసం కష్టమేనని సర్వేలో కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.