Uttarkasi Rescue Operation: ఉత్తరాఖండ్ లోని
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు మరికాసేపట్లో విముక్తి లభించబోతుంది. 17 రోజులుగా నిరంతరాయంగా
జరిగిన సహాయ చర్యలో మైనింగ్ లో అపార అనుభవం ఉన్న దేశ, విదేశాలకు చెందిన నిపుణులు
సేవలందించారు.
అధునాతన యంత్రాల సాయంతో డ్రిల్లింగ్ ప్రారంభించారు. కానీ సహాయ చర్యల
చివరి దశలో నిషేధిత ప్రమాదకర ర్యాట్ హోల్ మైనింగ్ అవసరమైంది. కార్మికులను బయటకు
తీసుకొచ్చేందుకు ఈ పద్థతి ఎంతగానో దోహదపడింది. 24 మంది ర్యాట్ హోల్ మైనింగ్
కార్మికులు 800 మీల్లిమీటర్ల పైపు గుండా వెళ్ళి చిన్న చిన్న ఆయుధాలతోనే తవ్వకాలు
జరిపారు.
ఒక్కో కూలీని బయటకు తీసుకొచ్చేందుకు
మూడు నుంచి నాలుగు నిమిషాల సమయం పడుతుంది. మొత్తం 41 మంది కార్మికులు బయటపడేందుకు
మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశముంది.
కార్మికుల కోసం సంఘటనా స్థలానికి 30
కిలోమీటర్ల దూరంలో 41 బెడ్లతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అవసరమైన
వారికి అక్కడే చికిత్స అందిస్తారు. సంఘటనా స్థలం నుంచి అంబులెన్సుల ద్వారా వారిని
తరలిస్తారు. అత్యవసరం వైద్యం అవసరం అయితే హెలికాప్టర్ ద్వారా ఇతర ప్రదేశాలకు
తరలించే ఏర్పాట్లు కూడా చేశారు.
చివరి దశలో ఆగర్ మిషన్ డ్రిల్లింగ్
మిషన్ బ్లేళ్ళు విరిగిపోయాయి. దీంతో
మైనింగ్ నిపుణులు ర్యాట్ హోల్ మైనింగ్ చేయాలని నిర్ణయించారు.
ర్యాట్ హోల్ మైనింగ్ అంటే, గని
ఉపరితలంపై మనిషి దూరేంత కన్నం వేసి అందులోకి వెళ్ళి సమాంతరంగా చిన్న చిన్న కన్నాలు
వేసి బొగ్గు పొరలు తొలగిస్తారు. మేఘాలయలో ఈ పద్ధతి ఎక్కువగా వాడుకలో ఉంది. అక్రమ
బొగ్గు గనుల్లో ఈ పద్ధతిలోనే తవ్వకాలు జరుపుతారు. ఈ విధానం ప్రమాదకరం కావడంతో గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది.