చత్తీస్గఢ్ ఉత్తరకాశీ సమీపంలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను (tunnel trapped workers) వెలికితీసేందుకు అన్ని ప్రయత్నాలు వేగవంతం చేశారు. అమెరికా నుంచి తెచ్చిన డ్రిల్లింగ్ మెషీన్ మొరాయించడంతో బొగ్గుగనిలో ఎలుక బొరియలు మాదిరి తవ్వకాలు చేపట్టే కార్మికులను రంగంలోకి దించారు. ఇప్పటికే 200 మి.మీ వ్యాసం కలిగిన పైపులను 75 మీటర్లు పంపించగలిగారు. మరో ఐదు మీటర్లు పంపించ గలిగితే ఇక చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను తీసుకురావడానికి మార్గం సుగమం అవుతుందని అధికారులు తెలిపారు.
సొరంగ మార్గంలో సమాంతరంగా తవ్వకాలు చేపట్టిన మిషిన్ మొరాయించడంతో పనులు నిలిచిపోయాయి. అక్కడి నుంచి బొగ్గు గని కార్మికులతో తవ్వకాలు మొదలు పెట్టారు. ఎలాంటి అవరోధాలు ఎదురుకొకపోతే రేపు ఉదయానికి తవ్వకాలు పూర్తవుతాయని భారత ఆర్మీ విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ హర్పాల్ సింగ్ తెలిపారు.
ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా సొరంగం మార్గాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
సొరంగం కాంట్రాక్టు పనులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అదానీ గ్రూపు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థలకు కూడా సొరంగం పనుల్లో ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది.
పదిహేను రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు రోబోలను రంగంలోకి దింపుతున్నారు. ఈ రోబోలు కార్మికుల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి, వారికి ఇంటర్నెట్ సేవలు అందించనున్నాయి.