అసెంబ్లీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో
పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థులను
గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
పొత్తు
విషయంలో బీఆర్ఎస్ను బీజేపీ ఎప్పటికీ దగ్గరకు రానివ్వదని ప్రధాని మోదీ అన్నారు.
బీజేపీతో దోస్తీకి కేసీఆర్ ప్రయత్నించారని చెప్పిన మోదీ, తాను తెలంగాణ ప్రజల
ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండదలుచుకోలేదన్నారు. బీజేపీ దరిదాపుల్లోకి కూడా బీఆర్ఎస్
ను రానివ్వమని ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు.
మహబూబాబాద్
లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని
మోదీ, తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని
సీఎం చేస్తామన్నారు. తెలంగాణను కేసీఆర్, మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారని
దుయ్యబట్టారు. పిచ్చి విశ్వాసాలతోనే సచివాలయాన్నికేసీఆర్ నాశనం చేశారని ఆగ్రహం
వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన అన్ని స్కాములపైనా దర్యాప్తు జరిపి చర్యలు
తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కరీంనగర్
సభలో ప్రసంగించిన మోదీ, తెలంగాణ నీటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారాయని
ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత లిక్కర్ స్కాంపై దర్యాప్తు వేగవంతం అవుతుందన్నారు.
పోలింగ్ రోజున కేసీఆర్ కు ప్రజలు సినిమా చూపించడం ఖాయమని సైటర్లు వేశారు.
కాంగ్రెస్,
బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్
షా ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ లు ఒకే తాను ముక్కలని ఆరోపించిన
అమిత్ షా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాహుల్ ప్రధాని గా ఉండేలా ఇరు పార్టీలు సంధి
చేసుకున్నాయని అన్నారు.
కరీంనగర్
లోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సకల జనుల
సంకల్ప సభలో ప్రసంగించిన అమిత్ షా… బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఓటు వేస్తే కుటుంబ
పార్టీలే అధికారంలోకి వస్తాయని, బీజేపీకి ఓటు వేస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరారు.
పేదల తరఫున మాట్లాడినందుకే
ఈటల రాజేందర్ పై కేసీఆర్ కక్ష పెంచుకున్నారని ఆరోపించారు.
తెలంగాణకు
కేంద్రం రూ. 7 లక్షల కోట్లు అందజేసిందన్న అమిత్ షా, 2024లో కూడా మోదీనే ప్రధాని
అవుతారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ భేటీలో పెట్రోల్,
డిజీల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.