బీఆర్ఎస్
పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ(PM MODI) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల(TS ELECTIONS) ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో
నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, ఏడు దశాబ్దాలుగా అధికారంలో
ఉన్న కాంగ్రెస్ కూడా ప్రజల్ని విస్మరించిందని దుయ్యబట్టారు.
తెలంగాణలో
భారతీయ జనతా పార్టీకి మద్దతు పెరిగిందన్న మోదీ, సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం
కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
బీజేపీ
ఏం చెబుతుందో అదే చేస్తుందన్నమోదీ, జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ ట్రాకే అందుకు
నిదర్శనమన్నారు.
ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళలకు చట్ట సభల్లో
30 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత బీజేపీదేనన్నారు. సైనికులకు వన్ ర్యాంక్ –వన్ పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు రైతులకు
గిట్టుబాటు ధర పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రామమందిర నిర్మాణ హామీని
నిలబెట్టుకున్నామన్నారు.
తెలంగాణకు
పసుపు బోర్డు కేటాయింపు వాగ్దానాన్ని నిలుపుకున్న విషయాన్ని ప్రజలకు గమనించాలని
కోరిన ప్రదాని మోదీ, బీజేపీకి రాష్ట్రంలో అధికారమిస్తే హామీ మేరకు బీసీనే
ముఖ్యమంత్రి చేస్తామని పునరుద్ఘాటించారు. సామాజిక న్యాయం కోసం బీజేపీ
పాటుపడుతుందన్నారు.
దళిత
సీఎం హామీపై కేసీఆర్ మాటమార్చారని దెప్పిపొడిచిన మోదీ, దళిత వర్గాలను బీఆర్ఎస్
మోసం చేసిందని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలు, దళితుల కోసం కేసీఆర్ చేసిందేమీ
లేదన్నారు.