అవినీతి
నిరోధక శాఖ అధికారులు, అక్రమార్కుల ఆటకట్టిస్తున్నారు. డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి
ఆదేశాలతో 14400 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అవినీతి అధికారులపై ఫిర్యాదులు
స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో ఏకకాలంలో ముమ్మర సోదాలు నిర్వహించి
అక్రమాస్తులను గుర్తించి సీజ్ చేస్తున్నారు.
ఈ ఏడాది ఏసీబీ అధికారులు మొత్తం 146 కేసులు నమోదు
చేయగా, ఈ నెలలోనే 22 మంది అవినీతి నిరోధక శాఖకు దొరికారు.
ఈ
నెలలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు.
కాకినాడ జిల్లా బెండపూడి ఆర్టీఏ చెక్ పోస్టులో
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు అందగా, అతని
నివాసంతో పాటు బంధువుల ఇళ్ళలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పలు అక్రమాస్తులు గుర్తించడంతో పాటు లెక్కలు
చూపని నగదు, బంగారం సీజ్ చేసినట్లు వెల్లడించారు.
నంద్యాల
జిల్లా రోడ్డు రవాణా కార్యాలయంలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్న కుంపటి
సువర్ణకుమారి నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు స్థిర, చరా
ఆస్తులు గుర్తించారు. హైదరాబాద్, మార్కాపురం, బనగానపల్లి, కర్నూలులోని ఏవో
నివాసంతో పాటు మరో ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. పలు ఆస్తులు గుర్తించారు.
నంద్యాల
జిల్లా మైన్స్, జియాలజీ శాఖలో అసిస్టెంట్ జియాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న
గండికోట వెంకటేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై స్పందించి
సోదాలు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లో సబ్ రిజిస్టర్
గా విధులు నిర్వహిస్తున్న లాలా బాలనాగ ధర్మసింగ్ నివాసంలో కూడా ఏసీబీ సోదాలు
చేపట్టింది. అధికారులు వివరాలు సేకరిస్తున్న సమయంలో బాలనాగ ధర్మ సింగ్ అక్కడి
నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతడికి పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు
ఏసీబీ గుర్తించి పలు స్థిర, చర ఆస్తులు
స్వాధీనం చేసుకుంది.
కాకినాడ జిల్లా సామర్లకోట మండల
పనసపాడుకు చెందిన ఓ వ్యక్తికి బర్త్
సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆర్ఐ పదివేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై ఫిర్యాదు
అందుకున్న అధికారులు, పిర్యాదుదారుడి నుంచి ఆర్ఐ లంచం తీసుకుంటుండగా రెడ్
హ్యాండెడ్ గా పట్టుకున్నారు.