మణిపూర్ అల్లర్లు సద్దుమణుగుతున్న వేళ మరో సమస్య తెరమీదకు వచ్చింది. ప్రత్యేక పాలనకు అనుమతించాలంటూ ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్కు (ITLF)చెందిన కుకీ జో తెగల సంస్థ బుధవారంనాడు చురచంద్పూర్లో భారీ ర్యాలీ నిర్వహించింది. వారి డిమాండ్ను మణిపూర్ చట్టసభ సభ్యులు ఖండించారు. తమ జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో ప్రత్యేక పాలనకు అనుమతించాలంటూ ఐటీఎల్ఎఫ్ ప్రభుత్వానికి రెండు వారాల గడువిస్తూ అల్టిమేటం జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మణిపూర్ చట్టసభ సభ్యులు కోరారు.
ఐటీఎల్ఎఫ్ చేసిన ప్రకటనను మణిపూర్ ప్రభుత్వం ఖండించింది. ఇది బాధ్యతా రాహిత్యంతో కూడుకున్న ప్రకటనగా పేర్కొంది. దీనికి రాజ్యాంగ, చట్టపరమైన ప్రాతిపదిక లేదని కూడా ప్రకటించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయడం, వాటికి భంగం కలిగించే లక్ష్యంతోనే ఇలాంటి ప్రకటన చేసినట్లు కనిపిస్తోందని మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆరు నెలలు గడువిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని, మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే స్వరాజ్యం ఏర్పాటు చేస్తామని ఐటీఎల్ఎఫ్ ప్రకటించింది. కేంద్రం గుర్తించినా, గుర్తించకపోయినా ముందుకు సాగుతామని ఐటీఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మువాన్ టోంబింగ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతం మాదిరిగా కుకీ జో ప్రాంతాల్లో స్వయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టోంబింగ్ ప్రకటించారు. ఈ డిమాండ్ చేస్తున్న వారిలో
10 మంది గిరిజన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఆయన గుర్తుచేశారు.