ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై
కేంద్రప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని పాలకపార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షురాలు పురందరేశ్వరి విమర్శించారు. కేంద్రప్రభుత్వం నుంచి అందుతున్న నిధులతోనే
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు.
గ్రామ
సచివాలయాల నిర్మాణంలో కూడా కేంద్రం నిధులు అందజేసిందన్నారు.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అమరావతి
రైతులకు ఇంతవరకు వార్షిక కౌలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం
చేశారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2,500 కోట్లు
అందజేసిందన్నారు. రాజధాని నిర్మాణ విషయంలో
గత ప్రభుత్వం తాత్కాలిక భవనాల నిర్మాణం పేరిట తాత్సారం చేసిందన్నారు.
అమరావతి-అనంతపురం అనుసంధానంలో భాగంగా రోడ్డు
నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు.
స్మార్ట్ సిటీ పథకం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అవి ఎటు
పోయాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలని
డిమాండ్ చేశారు. పేదల ఇళ్ళ నిర్మాణాల
విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు.
దేశంలోని పేదల అభ్యున్నతి కోసం బీజేపీ
నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని పురందరేశ్వరి అన్నారు. నరేంద్ర మోదీ
నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు.