తెలంగాణ శాసనసభ ఎన్నికలకు(TS
ELECTIONS) నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగిసింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా.. నేటి మధ్యాహ్నం3 గంటలకు
ముగిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికిమొత్తం 2,474 నామినేషన్లు దాఖలు కాగా.. చివరిరోజు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలై
ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 9 మంచి రోజు కావడంతో ప్రముఖ నేతలు నిన్ననే నామినేషన్లు వేశారు.
ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు 15వ తేదీలోపు తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముంది. మరోవైపు బీ-ఫామ్ ఇచ్చేందుకు గడువు ముగియడంతో ఆ పత్రం అందజేయని వారిని స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించనున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో గజ్వేల్లో దాదాపు 190, కామారెడ్డిలో
140కు
పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. విద్యార్థులు, యువత, రైతులు, అమరవీరుల
కుటుంబ సభ్యులు ఈ రెండు చోట్ల పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు.
గత అసెంబ్లీ
ఎన్నికల్లో అత్యధికంగా మల్కాజిగిరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఈసారి గజ్వేల్, కామారెడ్డి ఆక్రమించనున్నాయి.
కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
హాజరయ్యారు.
2018
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ
పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు
దాఖలయ్యాయి. 119
అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30వ
తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్న మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు
వినియోగించుకోనున్నారు. డిసెంబర్
3న కౌంటింగ్ చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.