UP cabinet meet held in Ayodhya for the first time
రామజన్మభూమిలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం
దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో సందడి పెరుగుతోంది. తాజాగా గురువారం నాడు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సమావేశాన్ని అయోధ్యలో
నిర్వహించారు.
అయోధ్యలో ఆలయ మ్యూజియం నిర్మాణం సహా
14 ప్రతిపాదనలకు యోగి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర శాసనసభ శీతాకాల
సమావేశాలను నవంబర్ 28 నుంచి నిర్వహించాలని కూడా క్యాబినెట్ సమావేశం
తీర్మానించింది. ఆ వివరాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియాకు వెల్లడించారు.
ముజఫర్నగర్లోని శుక్రతాళ్
అభివృద్ధి కోసం శుక్రతీర్థ వికాస్ పరిషత్ ఏర్పాటు చేయాలని యోగి క్యాబినెట్
నిర్ణయించింది.
అయోధ్యలోని మాంఝా జంతారా వద్ద 25
ఎకరాల్లో ఆలయ మ్యూజియం నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
‘అంతర్జాతీయ రామాయణ వైదిక పరిశోధనా
సంస్థ’ పేరుతో అయోధ్యలో ఒక పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసి విస్తరించాలన్న
ప్రతిపాదనను కూడా యోగి క్యాబినెట్ ఆమోదించింది.
భారత-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న దేవీపాటన్
డివిజన్ అభివృద్ధి కోసం మా పాటేశ్వరీ దేవీపాటన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటుకు
పచ్చజెండా ఊపారు.
రాష్ట్రంలో కొత్త డ్రోన్ విధానం
అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ విధానం ప్రకారం డ్రోన్ నిర్వాహకులు తమ
డ్రోన్ల వివరాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఇక యూపీ శాసనసభ సమావేశాలు నవంబర్ 28
నుంచి నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
జిల్లా స్థాయిలో మహిళా స్వయంసహాయక
బృందాలకు ఆహార పదార్ధాల తయారీ కేంద్రాలు నెలకొల్పాలని
యోగి క్యాబినెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా చిన్నారులు,
మహిళలకు పోషకాహారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో
మొదటిసారిగా తన మంత్రివర్గ ప్రత్యేక సమావేశాన్ని రామకథా మ్యూజియం ఆవరణలో
నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రివర్గం అయోధ్యలోని మందిరాలు, ఇతర
పుణ్యప్రదేశాలను సందర్శించింది.
అయోధ్యలో మంత్రివర్గ సమావేశం జరిగిన
నవంబర్ 9కి ఆ నగరంలో రెండు విశిష్టతలున్నాయి. 1989 నవంబర్ 9న రామమందిర
నిర్మాణానికి మొదటి పునాది వేసారు. 2019 నవంబర్ 9న మందిర నిర్మాణానికి
సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. దాంతో ఈ క్యాబినెట్ సమావేశం ప్రత్యేకత
సంతరించుకుంది. అయోధ్యలో దీపావళి సందర్భంగా నిర్వహించే దీపోత్సవం గురించి కూడా
మంత్రివర్గం చర్చించింది.
మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి
ముందు మంత్రివర్గం హనుమాన్గఢీ ఆలయంలోనూ, భవ్య రామమందిరం వద్దా పూజలు నిర్వహించింది.