ఆసియా క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన ఆర్చరీ
క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖ సొంతగడ్డకు చేరుకున్నారు. చదరంగం క్రీడాకారిణి
కోనేరు హంపితో కలిసి గన్నవరం విమానాశ్రయానికి ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా
వారికి శాప్ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు, మంగళవారం నాడు
వారిద్దరూ మిగిలిన క్రీడాకారుల బృందంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
అయ్యారు.
చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో
ఆర్చరీలో మూడు స్వర్ణాలు సాధించటం గర్వంగా ఉందని జ్యోతిసురేఖ చెప్పారు. గన్నవరం
విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆసియా క్రీడల్లో కాంపౌండ్
ఆర్చరీలో టీమ్, ఇండివిడ్యువల్ ఈవెంట్స్లో జ్యోతిసురేఖ స్వర్ణపతకాలు గెలుచుకున్నారు.
తన ప్రతీ విజయంలోనూ తల్లిదండ్రులు అండగా నిలిచారని జ్యోతిసురేఖ చెప్పారు.
చదరంగంలో రజతం సాధించడం
ఆనందంగా ఉందని కోనేరు హంపి పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో చెస్ పోటీలు రెగ్యులర్గా
జరిగేవి కావన్నారు. 2006, 2010 తర్వాత మళ్లీ ఈ ఏడాదే
జరిగాయని వివరించారు. కుటుంబం ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమయిందన్నారు.