క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ రెండవ మ్యాచ్లో
పాకిస్తాన్ కొంచెం కష్టపడి, నెదర్లాండ్స్పై విజయం సాధించింది. బ్యాటింగ్లో, బౌలింగ్లో ముందు
కాస్త తడబడినా తర్వాత పుంజుకుని, బోణీ కొట్టింది. డచ్ జట్టు మొదట్లో చక్కటి
బౌలింగ్తో మ్యాచ్పై నియంత్రణ సాధించినట్లు కనిపించినా, క్రమంగా పట్టు జారింది. లక్ష్యఛేదనలోనూ
ప్రారంభం బాగున్నా, దాన్ని కొనసాగించలేకపోయింది.
శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో
జరిగిన మ్యాచ్లో పాక్ 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. పేసర్ బాస్ డి
లీడ్ (4/62) సహా నెదర్లాండ్స్ బౌలర్లంతా సమష్టిగా సత్తాచాటడంతో మొదట పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు
ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ (68), సాద్ షకీల్ (68) రాణించారు.
లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ విఫలమైంది.
పదునైన పాక్ బౌలింగ్ను ఎదుర్కోలేక 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. విక్రమ్జీత్ సింగ్ (52), బాస్
డి లీడ్ (67 పోరాటం సరిపోలేదు. హారిస్ రవూఫ్ (3/43), హసన్
అలీ (2/33) పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఒడౌడ్ (5)ను హసన్ అలీ, ఆకర్మ్యాన్ (17)ను ఇఫ్తికార్
అహ్మద్ ఔట్ చేయడంతో నెదర్లాండ్స్ 50 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో విక్రమ్జీత్, బాస్ డి లీడ్
గొప్పగా పోరాడారు. విక్రమ్జీత్ 65 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరో ఎండ్లో లీడ్ బౌండరీలు, సిక్సర్లతో
రెచ్చిపోయాడు. 120/2తో నెదర్లాండ్స్ పటిష్ట స్థితికి చేరుకోవడంతో పాక్ శిబిరంలో ఆందోళన
మొదలైంది. కాసేపటికే విక్రమ్జీత్, లెగ్ స్పిన్నర్ షాదాబ్ బౌలింగ్లో భారీషాట్కు
ప్రయత్నించి ఔటయ్యాడు. అక్కడ్నుంచి వికెట్ల పతనం ఆగలేదు. తెలుగు కుర్రాడు తేజ
నిడమానూరు (5), ఎడ్వర్డ్స్ (0), సకిబ్ (10) కూడా ఎక్కువసేపు నిలవలేదు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న
పాకిస్తాన్ 50 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. పసికూన నెదర్లాండ్స్తో మ్యాచ్లోనైనా 300 స్కోరు
సాధించలేకపోయింది. ఒక్క బ్యాటర్ అయినా 70 పరుగులు చేయలేదు. పదునైన బౌలింగ్.. చురుకైన
ఫీల్డింగ్.. చక్కని బౌలింగ్ మార్పులతో నెదర్లాండ్స్ వేసిన ఎత్తులకు పాక్ టాప్ఆర్డర్
చిత్తయింది. చూస్తుండగానే జమాన్ (12),
కెప్టెన్ బాబర్ అజామ్ (5), ఇమాముల్ హక్ (15) పెవిలియన్
చేరుకున్నారు. 38 పరుగులకే పాక్ 3 వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లలో పాక్ స్కోరు 43/3. ఈ
స్థితిలో రిజ్వాన్, షకీల్ జట్టును ఆదుకున్నారు. స్కోరు 100 దాటించారు. అయితే
షకీల్ను బోల్తాకొట్టించిన ఆర్యన్.. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీశాడు. నవాజ్
(39), షాదాబ్ఖాన్ (32), షహీన్ అఫ్రిది (13*), హరిస్ రవూఫ్ (16) పాకిస్తాన్కు గౌరవప్రదమైన స్కోరునందించారు.