ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. 10 మీటర్ల రైఫిల్ విభాగంలో భారత్ స్వర్ణ పతకం సాధించింది. భారత క్రీడాకారులు ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పారు. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్, తోమర్ టీం ఫైనల్లో 1893.7 పాయింట్లు సాధించి స్వర్ణంతోపాటు, ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గతంతో చైనా క్రీడాకారులు సాధించిన 1893.3 పాయింట్ల రికార్డులను బద్దలు కొట్టారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు ఒక స్వర్ణం, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించిన టీం, వ్యక్తిగత విభాగాల్లోనూ సత్తా చాటి ఫైనల్స్కు చేరుకున్నారు. ఫైనల్ కోసం జరిగిన పోరులో రుద్రాంక్ష్ మూడోస్థానం, తోమర్ ఐదు, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించారు. ఇక పురుషుల ఫోర్ రోయింగ్ ఈవెంట్లోనూ భారత క్రీడాకారులు కాంస్య పతకం సాధించారు.