చైనా మరోసారి తన
వక్రబుద్ధి చూపింది. తమ దేశం ఆతిథ్యమిస్తున్న ఆసియన్ గేమ్స్లో పాల్గొనడానికి
వెళ్ళాల్సిన మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు
వీసాలు, అక్రెడిటేషన్లు నిరాకరించింది. దానికి ప్రతిగా, మన మంత్రి అనురాగ్ ఠాకూర్,
తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
‘‘చైనాలోని
హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి అరుణాచల్ ప్రదేశ్కు
చెందిన భారత క్రీడాకారుల పట్ల చైనా వివక్ష ప్రదర్శించింది. వారిని ఉద్దేశపూర్వకంగా
లక్ష్యం చేసుకున్న చైనీస్ అధికారులు వారికి అక్రెడిషన్లు నిరాకరించినట్లు
తెలిసింది’’ అని భారత ప్రభుత్వం ప్రకటించింది.
‘‘దీర్ఘకాలంగా,
నిలకడగా భారత్ అనుసరిస్తున్న విధానం మేరకు… ప్రాంతం లేదా జాతి ఆధారంగా భారత
పౌరుల పట్ల వివక్ష చూపడాన్ని భారత్ కచ్చితంగా ఖండిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్
ఎప్పుడూ భారత్లో అవిభాజ్య, అంతర్భాగంగానే ఉండేది, ఉంది, ఉండబోతుంది. అందులో ఏ మార్పూ
లేదు’’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి స్పష్టం చేసారు.
చైనా ఉద్దేశపూర్వకంగా కొందరు భారత అథ్లెట్లను రానీయకుండా నిలువరించడం పట్ల భారత్
తీవ్ర నిరసన ప్రకటించినట్లు ఆయన చెప్పారు. చైనా చర్యలు ఆసియా క్రీడల స్ఫూర్తిని, ఆ
క్రీడాకార్యక్రమపు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ
అంశంలో భారత్ తన ప్రయోజనాలను రక్షించుకునే హక్కు కలిగి ఉందని స్పష్టం చేసారు.
అరుణాచల్
ప్రదేశ్ను చైనా దక్షిణ టిబెట్గా వ్యవహరిస్తుంది, ఆ రాష్ట్రం తమ దేశంలోనిదేనని చెప్పుకుంటుంది.
అందుకే అరుణాచల్ ప్రాంతానికి చెందిన భారత క్రీడాకారులకు వీసాలు ఇవ్వదు. గతంలో కూడా
వారికి స్టేపుల్డ్ వీసాలు ఇవ్వడం వివాదానికి దారి తీసింది.