Monday, December 11, 2023

Odisha-365
google-add

రాణీ కీ వావ్..... భారత శిల్పకళాచాతుర్యానికి నిదర్శనం

P Phaneendra | 10:30 AM, Mon Nov 20, 2023

Rani Ki Vav… an amazing engineering marvel of ancient India


రచన: చాడా శాస్త్రి

 

క్రికెట్ ప్రపంచ కప్ఫైనల్ మ్యాచ్‌ ముందురోజు భారత్, ఆస్ట్రేలియా జట్ల కెఫ్టెన్లు ఇద్దరూ 'రాణీ కీ వావ్' అనే కట్టడం లో వరల్డ్ కప్ ట్రాఫీని ప్రదర్శించారు. ఇంతకీ ఏమిటీ రాణీ కీ వావ్?

మన దేశంలోనే చాలామందికి ఈ కట్టడం గురించి తెలియదు. ఇక విదేశీయులు ఎంతమందికి తెలుస్తుంది. అందుకే దీనికి ప్రచారం కల్పించే ఉద్దేశ్యం లో భాగంగా ఆ ఫొటోషూట్ ఏర్పాటు చేసారు.

"రాణీ కీ వావ్" అనేది భూమి లోపల 7 అంతస్తుల మెట్లతో కూడిన దిగుడు బావి. ఇది గుజరాత్ రాష్ట్రంలో పాటన్ జిల్లాలో ఉంది. ఈ దిగుడుబావిని మన 7 అంతస్తుల దేవాలయాన్ని తిరగేసి నిర్మిస్తే ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో భూమి లోపల నిర్మించారు.

ఈ 'రాణీ కీ వావ్' చాళుక్య రాజవంశం పాలనలో నిర్మించబడింది. ఇది సరస్వతీ నది ఒడ్డున ఉంది. 1304లో జైన సన్యాసి మేరుతుంగ రచించిన ప్రబంధ-చింతామణి ఇలా పేర్కొంది: "నరవరాహ ఖెంగార కుమార్తె ఉదయమతి, సహస్రలింగ తటాకం కంటే గొప్ప వైభవంగా శ్రీపట్టణ (పాటన్) వద్ద ఈ మెట్ల బావి 1063 లో ప్రారంభించబడి 20 సంవత్సరాల తరువాత పూర్తయింది అని దానిలో ఉంది. ఇది భీమరాజు జ్ఞాపకార్థం అతని రాణి ఉదయమతిచే నిర్మించబడిందని ఉంది.

ఈ మెట్లబావి తరువాత కాలంలో సరస్వతి నదికి వచ్చిన వరదల కారణంగా పూర్తిగా మట్టి, బురదతో నిండిపోయింది. 1890లలో బ్రిటీష్ పురాతత్వ శాస్త్రవేత్తలు హెన్రీ కౌసెన్స్, జేమ్స్ బర్గెస్ దీనిని చూసి, బావి షాఫ్ట్ మరియు కొన్ని స్తంభాలు మాత్రమే కనిపించాయని చెప్పారు. వారు దీనిని 87 మీటర్ల (285 అడుగులు) లోతు భారీ గొయ్యిగా మాత్రమే వర్ణించారు. ఐతే 1940లలో, అప్పటి బరోడా స్టేట్ జరిపిన త్రవ్వకాల్లో ఈ మెట్ల బావిని గుర్తించారు. చివరిగా మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ద్వారా 1981 నుండి 1987 వరకు తవ్వకాలు మరియు పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. ఆ తవ్వకాల్లో రాణీ ఉదయమతి చిత్రం కూడా లభించింది.  దీన్ని 22 జూన్ 2014న యునెస్కో (UNESCO)ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.

‘రాణీ కీ వావ్’ వివరాలు తెలుసుకుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి.

1. అసలా నిర్మాణ ఆలోచనే అద్భుతం. మన దేవాలయాన్ని తిరగేసి అంటే ఇంగ్లీషు 'V' ఆకారంలో భూమిలో నిర్మిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. 7 అంతస్తుల తో దీని నిర్మాణం సరిగ్గా అలాగే చేశారు

2. ఇది 92 అడుగుల లోతు, పైన 213 అడుగుల పొడుగు, 66 అడుగుల వెడల్పుతో నిర్మించారు.పూర్తి దిగువన బావి తవ్వారు.

3. ఈ బావి ప్రతీ అంతస్తులో భారీ స్తంభాల ఆధారంగా మండపాలు నిర్మించారు. వీటిల్లో స్తంభాలు, గోడలు,పైకప్పులు పూర్తిగా చెక్కిన శిల్పాలు, డిజైన్లతో నింపేశారు. ఈ మెట్లబావిలో మొత్తం 212 స్తంభాలు ఉన్నాయి.

4. ఈ శిల్పాలలో బ్రహ్మ, విష్ణువు,శివుడు,గణేశుడు,కుబేరుడు,భైరవుడు,సూర్యుడు, ఇంద్రుడు, హయగ్రీవుడు,లక్ష్మి, పార్వతి, సరస్వతి, చాముండ, క్షేమంకరి, సూర్యాణి, సప్తమాతృకలు, దుర్గ వంటి దేవీదేవతల శిల్పాలు ఉన్నాయి. విష్ణు సంబంధిత శిల్పాలు ఎక్కువ. శేషశాయి విష్ణువు, విష్ణుమూర్తి విశ్వరూపం, దశావతారాలు, నాగ కన్యలు, అప్సరసలు మొదలైనవి ఉన్నాయి.

5. దేవీదేవతలకు చెందిన శిల్పాలు మాత్రమే కాకుండా వివిధ జంతువులు, పక్షులు, జలచరాలు, వృక్షాలకు చెందిన శిల్పాలు ఉన్నాయి.

6. అంతే కాదు, స్థానిక చేతివృత్తుల వారు దుస్తుల మీద, వివిధ వస్తువుల మీద చిత్రీకరించే రకరకాల గణిత రేఖాచిత్రాలు, డిజైన్లు అక్కడ చెక్కిన శిల్పాలలో చూడవచ్చు.

7. ఆనాటి సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు కూడా చాలా వున్నాయి. స్త్రీలు తల దువ్వుకోవడం, వివిధ అలంకరణలు చేసుకోవడం, సేవకులతో పరిచర్యలు చేయించుకోవడం, నృత్య భంగిమలు మొదలగునవి ఉన్నాయి.

8. అన్నిటి కంటే ఆశ్చర్యం కలిగించే శిల్పం స్నానం చేసి తడి వెంట్రుకలతో ఉన్న ఒక యువతి జుట్టు నుండి రాలుతున్న ముత్యాల వంటి నీటి బిందువులను మరొక యువతి పట్టుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఈ శిల్పాలలో స్త్రీల కంకణాలు, చెవిపోగులు, హారాలు, నడుము నడికట్టు, చీలమండలు, సొగసైన బట్టలు, చక్కగా బాగా దువ్విన జుట్టు, వివిధ డిజైన్లలో నగలు కనిపిస్తాయి. అనేక రకాల వ్యక్తీకరణలు, భావోద్వేగాలు ఈ శిల్పాలలో స్పష్టంగా కనిపిస్తాయి.

9. సుమారు 500 కంటే ఎక్కువగా ప్రధాన శిల్పాలు, వెయ్యికి పైగా చిన్న శిల్పాలూ ఉన్నాయి.  

సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైన ఇంజినీరింగ్ కట్టడం నిర్మించారు అంటే భారతీయుల కళానైపుణ్యం, నిర్మాణ చాతుర్యం ఎంతటిదో తెలిసి ఆశ్చర్యపోతాం.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add

రాజకీయం