జమ్ముూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడికి కారణమైన లష్కరే తయ్యబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేసింది. ఐక్య రాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో ‘టిఆర్ఎఫ్’ను చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ మేరకు భారత ప్రతినిధుల బృందం తాజాగా ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులను కలిసింది.
ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 శాంక్షన్స్ కమిటీకి భారత బృందం పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి వివరించింది. అక్కడ జరిగినది ఉగ్రవాద దాడే అని ఋజువు చేసే సాక్ష్యాలూ ఆధారాలను సమర్పించింది. ఆ బృందం యూఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్తో కూడా భేటీ అయింది. ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 శాంక్షన్స్ కమిటీ అల్ఖైదా, ఐసిస్, వాటికి సంబంధించిన ఇతర ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను పర్యవేక్షిస్తుంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులు, సంస్థల ఆస్తులను స్తంభింపజేయడం, వారి ప్రయాణాల పైనా, ఆయుధాల సేకరణ పైనా నిషేధం విధించడం వంటి చర్యలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
“న్యూయార్క్లో ఉన్న భారత ప్రతినిధుల బృందం బుధవారం కౌంటర్- టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులను కలిసింది. ఆంక్షల పర్యవేక్షణ బృందం, యూఎన్లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపింది. యూఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్తో భేటీ అయింది” అని అధికార వర్గాలు వెల్లడించాయి.
పహల్గామ్ మారణహోమానికి బాధ్యులుగా ప్రకటించుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ, జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే భారత రాజ్యాంగపు 370వ అధికరణం రద్దు తర్వాత కొత్తగా ఏర్పడింది. టిఆర్ఎఫ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషిద్ధ లష్కర్-ఎ-తయ్యబా అనుబంధ సంస్థ. దానికి సుప్రీం కమాండర్గా షేక్ సాజిద్ గుల్, చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దార్ పని చేస్తున్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను భారతదేశ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించి ఏడాది పైనే అయింది. 2023 జనవరి 6వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
టిఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకుంటోందని హోంశాఖ తెలిపింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతోందని వివరించింది. ఉగ్రవాదంలో చేరేలా యువకులను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేస్తోందని, ప్రేరేపిస్తోందని వెల్లడించింది. పలువురి హత్యలకు కుట్రలు పన్నుతోందని పేర్కొంది.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్ చేరువలో ఉన్న బైసరన్ లోయలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు కిరాతక చర్యకు పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చి, హిందూ పర్యాటకులను కాల్చి చంపారు. 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. కేవలం హిందూ పురుషులనే లక్ష్యంగా చేసుకుని పాశవికంగా హత్య చేశారు. దాంతో భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించేలా ఐరాసలో ప్రయత్నాలు ప్రారంభించింది.