అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ – ఐఎంఎఫ్) తాజా సమావేశంలో పాకిస్తాన్కు ఋణం మంజూరు చేసే అంశం మీద జరిగిన ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది. పాకిస్తాన్ ప్రత్యక్షంగా తమ గడ్డ మీద నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అలాంటి దేశానికి ఋణం ఎలా మంజూరు చేస్తారని భారత్ నిలదీసింది. ఏమాత్రం జవాబుదారీతనంతో వ్యవహరించని ఉగ్రవాద సమర్ధక దేశానికి నిరంతరాయంగా ఆర్థికంగా అండగా నిలవడంపై భారత్ తన ప్రగాఢమైన వ్యతిరేకతను నొక్కిచెప్పింది. ఓటింగ్కు గైర్హాజరు కావడం అన్నది నేరుగా వ్యతిరేకించడం కాకపోయినప్పటికీ, ఐఎంఎఫ్కి ఉన్న ప్రత్యేకమైన ఓటింగ్ విధానం పరిమితుల్లో భారత్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అదే అత్యుత్తమమైన మార్గం.
ఐఎంఎఫ్లో నిర్ణయం ఎలా తీసుకుంటారు?
— అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ బోర్డులో 25మంది డైరెక్టర్లు ఉంటారు. వారు ఐఎంఎఫ్ సభ్య దేశాలకు, లేదా అలాంటి దేశాల సమూహాలకూ ప్రాతినిధ్యం వహిస్తారు. ఐఎంఎఫ్ రోజువారీ నిర్వహణ వ్యవహారాలను ఆ బోర్డే చూసుకుంటూ ఉంటుంది. ఋణాల ఆమోదం వ్యవహారం కూడా దాని పరిధిలోకే వస్తుంది.
— ఐక్యరాజ్య సమితిలోలా కాకుండా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ప్రతీ దేశానికీ ఒక ఓటు ఉంటుంది. ఐఎంఎఫ్లో ఓటువేసే అధికారం ఉండడం అనేది సభ్యదేశాల ఆర్థిక స్థాయిని ప్రతిఫలిస్తుంది. మొత్తంగా ఐఎంఎఫ్ అనేది ఏకాభిప్రాయం మీద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.
— ఓటింగ్ అవసరమైన సందర్భాల్లో, నేరుగా ‘కాదు’ అనే ఓటు ఉండదు. ఓటు వేయవలసిన డైరెక్టర్లు, సదరు అంశానికి అనుకూలంగా ఓటు వేయవచ్చు, లేదా గైర్హాజరు కావచ్చు. అంతే తప్ప ఏదైనా ప్రతిపాదన లేదా ఋణం మంజూరుకు వ్యతిరేకంగా నేరుగా ఓటు వేసే అవకాశం లేదు.
భారత్ ఎందుకు గైర్హాజరైంది?
తాజాగా ఐఎంఎఫ్ బోర్డు నిర్వహించిన ఓటింగ్కు భారతదేశం గైర్హాజరైంది. ఆ సమావేశంలో పాకిస్తాన్కు ఋణం ఆమోదించడం మీద నిర్ణయం తీసుకోవలసి ఉంది.
పాకిస్తాన్కు ఋణం మంజూరు చేయడానికి భారతదేశం పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేయలేదు. కానీ వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఏ అవకాశమూ లేనందునే భారతదేశం ఆ సమావేశానికి గైర్హాజరైంది.
ఐఎంఎఫ్ ఓటింగ్ పద్ధతికి ఉన్న పరిమితుల కారణంగా భారతదేశం ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఆ విధంగా, పాకిస్తాన్కు ఋణం మంజూరు చేయడానికి భారత్ తన తీవ్ర వ్యతిరేకతను ప్రకటించడానికే సమావేశానికి భారత ప్రతినిధి గైర్హాజరయ్యారు.
భారత్ అభ్యంతరాలకు కారణాలేంటి?
ఐఎంఎఫ్ తాజాగా ఇవ్వబోయే అప్పును పాకిస్తాన్ ఎలా వినియోగిస్తుంది అనే విషయాన్ని భారతదేశం ప్రశ్నించింది. గత 35 ఏళ్ళలో పాకిస్తాన్కు 28 సార్లు ఐఎంఎఫ్ అండగా నిలిచింది. ముఖ్యంగా గత ఐదేళ్ళలోనే నాలుగు ప్రాజెక్టులు చేపట్టింది. అయితే అర్ధవంతమైన, శాశ్వతమైన సంస్కరణలు మాత్రం పాకిస్తాన్లో రానే లేదు.
— పాక్ ఆర్థిక వ్యవహారాల మీద పెత్తనం అంతా ఆ దేశపు సైన్యానిదే. అవి పారదర్శకత లేమికి, పౌరుల హ్రస్వదృష్టికి, సంస్కరణల వ్యతిరేకతకూ నిదర్శనం అని భారత్ బలంగా చెప్పుకొచ్చింది.
— సరిహద్దులకు ఆవలి నుంచి నిరంతరాయంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ ఉన్న దేశానికి నిధులు సమకూర్చడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అటువంటి యుద్ధ పిపాస గల దేశానికి ఋణం ఇస్తే, ఆ మద్దతును పాక్ కచ్చితంగా దుర్వినియోగం చేస్తుంది. చరిత్ర అంతా అదే చెబుతోంది. పాకిస్తాన్కు అప్పు ఇవ్వడం వల్ల ఐఎంఎఫ్ పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగిస్తుందని భారత్ వాదిస్తోంది.
ఏది ఏమైనా, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్కు 230 కోట్ల డాలర్ల నిధులను ఋణంగా మంజూరు చేయడం సరి కాదని భారత్ వాదించింది. అలాంటి ఓటింగ్కు తాము దూరంగా ఉంటామని కుండ బద్దలుగొట్టింది.