ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె ప్రయత్నాలు విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాసేపటి కిందట కార్మిక సంఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కొలుకుంటోందని, సమ్మె ప్రయత్నాలు విరమించుకోవాలని మంత్రి పొన్నం కార్మిక సంఘాలను కోరారు. సమ్మెకు దిగి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని తెలిపారు. కార్మికుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు.
కార్మికులు, ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని యాజమాన్యం కోరింది. ఈ మేరకు కార్మికులకు బహిరంగ లేఖ రాసింది. తల్లిలాంటి ఆర్టీసీని కాపాడుకోవాలని లేఖలో సూచించింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఉద్యోగులు సహకరించాలని కోరింది. 2019లో జరిగిన సమ్మెతో ఆర్టీసీ సంక్షోభంలోకి వెళ్లిందని యాజమాన్యం గుర్తుచేసింది. ఆర్టీసీలో సమ్మెలు నిషేధించినట్లు గుర్తుచేసింది. ఎస్మా చట్టం ప్రకారం ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరించింది.