కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22 మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై ముస్లింలీగ్ అసంబద్ధమైన దుష్ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రారంభించింది. అక్కడ జరిగింది మతపరమైన దాడి కాదట. అక్కడి పర్యాటకాన్ని దెబ్బ తీయడానికి జరిగిన దాడి మాత్రమేనట. అలా ముస్లిం ఉగ్రవాదుల దుశ్చర్యను ఒక పక్కన సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూనే, దానికి విరుద్ధమైన మరో ప్రకటన కూడా చేసింది. పహల్గామ్ దాడి వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హస్తముందని ఆరోపించింది. ఏమాత్రం తార్కికంగా ఆలోచించినా, తాము చేసిన ఒక ప్రకటనను తామే ఖండించుకున్న సంగతి వారికి అర్ధమై ఉండాలి. చిత్రంగా, ఆ రెండు ప్రకటనలూ అబద్ధాలూ, అసంబద్ధాలూ అన్న సంగతి ప్రజలకు మాత్రం ఇట్టే అర్ధమవుతోంది.
పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు అడిగి, పురుషుల దుస్తులు విప్పి మరీ వారు హిందువులు అని నిర్ధారించుకున్న తరవాతే వారిని కాల్చి చంపారు. దానికి వారి కుటుంబ సభ్యులే ప్రత్యక్ష సాక్షులు. అయినవారిని కోల్పోయిన ఆవేదనలో ఉన్నవారు ఆ సమయంలో అబద్ధాలు మాట్లాడారని చెప్పేవారు ఎంత సిగ్గుమాలినవారో అర్ధం చేసుకోవచ్చు. అయినప్పటికీ ముస్లింలీగ్ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు పనక్కడ్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ పహల్గామ్ దాడికీ, ఇస్లాంకూ సంబంధం లేదని నిరూపించదలచుకున్నారు.
షిహాబ్ తంగల్ చెప్పడం ప్రకారం పహల్గామ్లో దాడి చేసిన వారి లక్ష్యం హిందువులు కాదట, అక్కడ అభివృద్ధి చెందుతున్న పర్యాటకాన్ని దెబ్బతీయడం మాత్రమే వారి లక్ష్యమట. ‘‘కోవిడ్ మహమ్మారి తర్వాత అక్కడి పర్యాటకం కోలుకుంది. అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం భారతీయ పర్యాటకంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది. అది చాలా ఆందోళనకరమైన పరిణామం’’ అని తంగల్ చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు, ఉగ్రవాదులు హింస కోసం మతాన్ని దుర్వినియోగం చేస్తారు అంతే తప్ప మతానికి ఏమాత్రం సంబంధం లేదు’’ అనే పాత వాదన మరోసారి తీసుకొచ్చారు. కశ్మీర్లో అలాంటి దాడులు మళ్ళీ జరగకుండా భద్రత పెంచాలంటూ ఒక కంటితుడుపు మాట చెప్పారు.
ముస్లింలీగ్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.కె కుంజాలికుట్టి కూడా అదే వాదనను సమర్ధించారు. ‘‘నేరస్తులు మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారి దుర్మార్గాలకు మతంతో సంబంధం లేదు’’ అని కుంజాలికుట్టి చెప్పుకొచ్చారు.
మరోవైపు ముస్లింలీగ్ వర్కింగ్ కమిటీ సభ్యుడు బషీర్ వల్లికొత్ ఇలాంటి దాడుల వెనుక సంఘ్పరివార్ హస్తం ఉందని ఆరోపించారు. ముంబై 23/11 సహా ఉత్తర భారతదేశంలో ఉగ్రవాద దాడులు ఎన్నింటినో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేయించిందని ఆరోపణ చేసారు. హిందువులను రెచ్చగొట్టి, వారిని బీజేపీకి మద్దతుగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందంటూ బషీర్ ఆరోపించారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే, ముస్లిం లీగ్ ఈ దాడి విషయంలో పాకిస్తాన్ను విమర్శించలేదు, లేదా ఉగ్రవాదాన్ని తిరస్కరించలేదు. అంతేకాదు, కతార్ కేంద్రంగా పనిచేసే అల్జజీరా ఈ పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ‘అతివాద అనుమానితులు’ అని వ్యవహరించినట్లే ముస్లింలీగ్ కూడా అలాగే వ్యవహరించింది.
సెక్యులరిస్టులు అందరూ సాధారణంగా చెప్పే ‘ఉగ్రవాదానికి మతం లేదు’ అనే వాదననే షిహాబ్ తంగల్ మరోసారి ప్రస్తావించారు. అయితే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న వారి మతం ఏమిటి, ఇతర మతాల పట్ల ముస్లిముల ఆలోచనా ధోరణి ఏమిటి అనే అంశాలను వారి వాదన మరోసారి చర్చకు పెట్టింది.
పహల్గామ్ దాడికి పాల్పడినది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ. 2019లో ఏర్పాటైన ఆ సంస్థకు అంతర్జాతీయంగా అపఖ్యాతి కలిగిన ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంస్థ ఇస్లాం మతపరమైన పదప్రయోగాలు, వాదనల ఆధారంగానే తమ అస్తిత్వాన్ని నిర్మించుకుంది. ప్రపంచం అంతటినీ ఇస్లామిక్ దేశంగా మార్చడం, ప్రపంచం అంతటా ఇస్లామిక్ విధానాలనే అమలు చేయడం తమ లక్ష్యాలని ఆ సంస్థ మొదటినుంచీ బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తోంది. అసలు లష్కరే తయ్యబా అంటే అర్ధమే ‘పవిత్ర సైన్యం’ అని. వారి లక్ష్యం పవిత్ర యుద్ధం అనబడే జిహాదే. దానికోసమే వారు ఈ ఉగ్రవాద దాడులు, హింసాకాండ సృష్టిస్తున్నారు. అటువంటి వారు చేస్తున్న దాడులను ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. పహల్గామ్ దాడుల లక్ష్యం పర్యాటకులే తప్ప మతపరమైన దాడి కాదని నమ్మబలకడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ప్రత్యక్ష సాక్షుల కథనాలన్నీ పహల్గామ్ దాడి ముస్లిమేతర పర్యాటకులను నిర్దిష్ట లక్ష్యంగా చేసుకుని జరిగిందే అని తెలియజేస్తున్నాయి. పుణేకు చెందిన సంతోష్ జగదలే అనే 54ఏళ్ళ వ్యాపారవేత్తను బైటకు పిలిచి ఖురాన్లోని కొన్ని వచనాలు పలకమని ఆదేశించారు. ఆయన ఆ పని చేయలేకపోయినప్పుడు కాల్చి పడేసారు. తమ మీద, చెవి వెనుక, వీపు మీద… మొత్తం మూడుచోట్ల కాల్చి చంపారని ఆయన కుమార్తె అసావేరీ జగదలే చెప్పారు. సంతోష్ పడిపోయాక ఉగ్రవాదులు ఆయన సోదరుణ్ణి పలుమార్లు వీపులో కాల్చి చంపారు. మరో మహిళ కథనం కూడా అలాగే ఉంది. ఉగ్రవాదులు తొలుత బాధితుల పేర్లా అడిగి, వారి మతాన్ని గుర్తించి ఆ తర్వాతే కాల్పులకు తెగబడ్డారని ఆమె చెప్పింది.
ఇంక కచ్చితంగా ముస్లిం ఉగ్రవాదులు హిందువులను గుర్తించి, వారిని లక్ష్యం చేసుకుని హత్య చేస్తే – దానికీ ఇస్లాం మతానికీ సంబంధం లేదని, ఆరెస్సెస్ వారే ఆ దాడి చేయించారనీ, గతంలో జరిగిన దాడులు కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘమే చేయించిందనీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆరోపణలు చేస్తుండడాన్ని గమనిస్తే… వారు ఎంత స్పష్టతతో తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారో అర్ధమవుతుంది.