నిందితుడి రాజకీయ పలుకుబడిని ప్రస్తావించిన మహిళా సంఘాలు
లైంగిక వేధింపుల కారణంగా రాజమహేంద్రవరంలో యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమపేరిట మోసపోయి ఆత్మహత్యకు యత్నించి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తుపై బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ నెల 23న ఈ ఘటన జరిగితే మూడు రోజులు పాటు గోప్యంగా ఉంచడం పలు సందేహాలకు తావిస్తోంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో ముఖ్యనేతగా ఉండటంతోనే కేసు తప్పుదోవ పడుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడని, మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. బ్రెయిన్కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం గురువారం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్బీట్, పల్స్ నార్మల్గా ఉన్నాయని వివరించింది.
ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకుంది.
లైంగిక వేధింపులు భరించలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై సిట్ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఆస్పత్రికి వెళ్ళి బాధితురాలికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్తో ఆత్మహత్యా యత్నం వెల్లడైంది. సూసైడ్ నోట్ లోని కొన్ని వాక్యాలు.. ఇలా ఉన్నాయి…‘‘
జీవితమంతా నాశనమైంది. ఏడవడానికీ ఓపిక లేదు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం లేదని రాసుకుంది. ఓ ఫంక్షన్కు చీర కట్టుకుని వెళ్లడమే తను చేసిన పాపంగా శాపంగా మారిందని నోట్ లో వాపోయింది. తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడని అతడి భార్య, బిడ్డ గురించి ఆలోచించి ఇప్పటి వరకు నోరు తెరవలేదని రాసుకుంది. చనిపోతూ అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని ఆడపిల్ల ఉసురు ఊరికే పోదని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తాను చనిపోయిన తర్వాత అవయవాలు ఇతరులకు దానం చేయమని ప్రాధేయపడుతూ నోట్ ను ముగించింది.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి రాజమహేంద్రవరం సమీపంలోని ఓ ఫార్మసీ కళాశాలలో ఫార్మా-బి ఆఖరి సంవత్సరం చదువుతోంది. నగరంలోని ఓ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్టైం ఉద్యోగం చేస్తోంది. అదే ఆసుపత్రిలో దీపక్ అనే ఉద్యోగి ప్రేమ, పెళ్లి పేరిట నమ్మించి లైంగికంగా వేధించాడని కేసు నమోదైంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఈ నెల 23న ఆసుపత్రి విధుల్లో ఉండగానే ఓ మత్తుమందును అధిక మోతాదులో శరీరంలోకి ఎక్కించుకుంది. ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఉంది.