భారతీయ సంస్కృతి, వారసత్వాల పరిరక్షణలో దేవాలయాల పాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, అభివృద్ధికి ఆదాయ వనరులుగానూ ఉంటున్నాయని తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సదస్సు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ (ఐటిసిఎక్స్) 2025 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దేవాలయ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం, వాటికి సాధికారత కల్పించడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే విషయంలో ఐటీసీఎక్స్ సేవలు అందిస్తోందని అన్నారు. 17 దేశాల్లోని 1,581 దేవాలయాలను ఏకంచేస్తూ ఐటీసీఎక్స్ మంచి కార్యక్రమం చేస్తుండడాన్ని అభినందించారు.
ఆ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించేందుకు దేవాలయ వారసత్వాన్ని, ఆధ్యాత్మికతను, సాంకేతిక బలాన్ని వినియోగించుకోవాలని దేశాన్ని కోరుతున్నాను. ఆధ్యాత్మిక సంపద రక్షణలో ఏఐ ఇంటిగ్రేషన్, ఫిన్టెక్ సొల్యూషన్స్, విరాళాల వినియోగం, సుస్థిరత, భద్రత, రద్దీ నియంత్రణ, ఆర్థిక పారదర్శకత పాటించాలని ఐటీసీఎక్స్ చెబుతోంది. ఆలయాల నిధుల నిర్వహణ, చట్టపరమైన సవాళ్లకు ఐసీటీఎక్స్ పరిష్కార మార్గాలను చూపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ -2047కు అనుగుణంగా ఐసీటీఎక్స్ దేవాలయాల నిర్వహణ, ఆర్థికాభివృద్ధికి సహకరిస్తోంది. భారతదేశంలోని అన్ని ఆలయాల ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు రూ.6 లక్షల కోట్లు ఉంటుంది. అంతటి విలువైన ఈ సంపదను కాపాడుకోవాలంటే ఆలయాల నిర్వహణలో పారదర్శకత అవసరం’’ అన్నారు.
ఆలయ సాంప్రదాయాల్లో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు ఉన్న అనుబంధాన్ని గుర్తించి ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో వారికి అవకాశాలు కల్పించామని చంద్రబాబు చెప్పారు. ‘‘అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ వేతనాన్ని రూ.15 వేలకు పెంచాం. వేద విద్యను అభ్యసించిన వారికి నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే దేవాలయాల అభివృద్ధికి రూ.134 కోట్లు కేటాయించాం. పరిమిత ఆదాయం ఉన్న చిన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు అందించే సాయాన్ని రూ.10 వేలకు పెంచాం’’ అన్నారు.
‘‘దేవేంద్రుడి రాజధాని స్ఫూర్తితో దేవతల నివాసంగా అమరావతి రాజధాని నిర్మిస్తున్నాం. తిరుమలలో 75 శాతం పచ్చదనం ఉంచేలా చర్యలు తీసుకుంటాం. ఆలయ నిర్వహణలో అవినీతికి తావులేకుండా చేస్తాం. ప్రతీ రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉండాలి. రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. 2024లో రాష్ట్రంలో 21 కోట్ల మంది ఆలయాలను సందర్శించారు. రాష్ట్ర సంస్కృతిని చాటేందుకు దేవదాయ శాఖ కృషి చేస్తోంది. యాత్రికులు, భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటున్నాం. దేవాలయాల సందర్శనకు వచ్చే వారికి పూర్తి స్థాయిలో సంతృప్తి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
సదస్సు ప్రారంభోత్సవంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆచార్య స్వామి గోవిందదేవ్ గిరి మహరాజ్ తదితరులు పాల్గొన్నారు.